<strong>ట్విట్టర్లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం</strong>హైదరాబాద్: జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు ఆహ్వానించి మరీ పార్టీ ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవడం దారుణమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. మహిళా పార్లమెంటు సదస్సుకు ఆహ్వానంపై వెళుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కె రోజాను ఈ నెల 11న గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అడ్డగించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అత్యంత బలవంతంగా ఆమెను పోలీసులు హైదరాబాద్ తరలించారు. ప్రభుత్వ తీరును ట్విట్టర్ లో వైయస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ఒక మహిళా ఎమ్మెల్యే పట్ల ప్రభుత్వమే ఇలా వ్యవహరిస్తే.. ఇక సమాజంలోని సామాన్య మహిళలకు రక్షణ ఎలా లభిస్తుందని ఆయన నిలదీశారు. ఆహ్వానించి మరీ ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవడమంటే.. జాతీయ మహిళా పార్లమెంటు సదస్సును అపహాస్యం పాలు చేయడమేనని వైయస్ జగన్ మండిపడ్డారు. ఎమ్మెల్యే రోజాకు జరిగిన అన్యాయంపై పోరాడుతామని, ఈ అంశాన్ని అన్ని వేదికల్లోనూ లేవనెత్తుతామని వైఎస్ జగన్ ట్విట్టర్లో స్పష్టం చేశారు. <br/>