లాలూనాయక్‌ కుటుంబాన్ని పరామర్శించిన వైయస్‌ జగన్‌

గుంటూరు: పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న మిర్చీ రైతు లాలూనాయక్‌ కుటుంబాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ పరామర్శించారు. గుంటూరు మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం దావులపల్లి గ్రామానికి చెందిన రైతు లాలూనాయక్‌ 6 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేసి నష్టపోయాడు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.  ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ లాలూనాయక్‌ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పెద్ద దిక్కు కోల్పోయిన ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు.


రాష్ట్రంలో ప్రభుత్వం పాటిస్తున్న అస్తవ్యస్త విధానాల వల్ల రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని, అందుకే వాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. లాలూనాయక్  రెండెకరాల్లో పత్తి సాగు చేస్తే 70 వేల ఖర్చు వచ్చిందని, మొత్తం పది క్వింటాళ్ల పత్తి పండగా.. క్వింటాలుకు రూ. 4వేల చొప్పున మొత్తం రూ. 40 వేలు రాగా 30 వేల రూపాయల నష్టం మిగిలిందని ఆయన చెప్పారు. ఇటీవలే అతడి భార్య తన బంగారం అమ్మి కూతురి పెళ్లి చేసిందని, ఆ సందర్భంలో కూతురికి పెట్టిన బంగారాన్ని మళ్లీ అల్లుడికి నచ్చజెప్పి తెచ్చుకుని దాన్ని బ్యాంకులో కుదువపెట్టి రూ. 40వేలు అప్పు తెచ్చారని జగన్ తెలిపారు. దాన్ని కూడా విడిపించే పరిస్థితి లేదని, పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయారని అన్నారు. ఇక్కడ పక్కనే నాగార్జున సాగర్ ఉన్నా.. వెయ్యి అడుగుల లోతుకు వెళ్తే తప్ప బోర్లలో నీళ్లు పడవని చెప్పారు. ఇంత దారుణమైన పరిస్థితిలో ప్రజలున్నారని, అయినా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం బుద్ధి, జ్ఞానం ఉన్నా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Back to Top