ఎవరు ఏ సమస్య చెప్పినా..వినడానికి నేను సిద్ధం..


- ప్రత్యేక హోదా వస్తేనే ఏపీ కి న్యాయం 
-  హామీలిచ్చి మోసం చేయడం చంద్రబాబు కు అలవాటే.. 
-  ప్రజాసంకల్ప యాత్రకు మంచి స్పందన వస్తుంది..  
-  అన్ని వర్గాలకు మేలు చేసేందుకునవరత్నాలు ప్రకటించాం.. 
- జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు 

కర్నూలు:  ప్ర‌జల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకే తాను పాద‌యాత్ర చేస్తున్నాన‌ని, ఎవ‌రు ఏ స‌మ‌స్య చెప్పినా విన‌డానికి తాను సిద్ధంగా ఉన్నాన‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలను మోసం చేస్తే ఏ ప్రభుత్వానికి అయినా పతనం తప్పదని, టీడీపీకి ప్ర‌జ‌లు బుద్ధి చెప్పే రోజులు ద‌గ్గ‌ర‌లోనే ఉన్నాయ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బేతంచర్లలో మంగళవారం మీడియా ప్రతినిధులతో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిట్‌చాట్‌ చేశారు. ఆయ‌న మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరుగుతుంద‌న్నారు. హోదాతోనే సమస్యలు పరిష్కారం అవుతాయ‌ని చెప్పారు.  పార్లమెంట్‌ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం చెప్పింది. హోదా వస్తుందని చంద్రబాబు కూడా ప్రజలను మోసం చేశాడ‌ని మండిప‌డ్డారు.  హామీలిచ‍్చి మోసం చేయడం చంద్రబాబుకు అలవాటే అని విమ‌ర్శించారు. హోదా వస్తే పరిశ్రమలతో పాటు రాష్ట్రం అన్నివిధాల అభివృద్ధి చెందుతుంద‌న్నారు.  ప్రత్యేక హోదా సాధిస్తే..రాష్ట్రం పదేళ్లలోనే అభివృద్ధి సాధించవచ్చు అన్నారు. లేకుంటే 60ఏళ్లు అయినా హైదరాబాద్‌లా అభివృద్ధి చెందటం అసాధ్యం కాద‌న్నారు. ఇక హైదరాబాద్‌లో ఏపీవారికి ఆరోగ్యశ్రీ తీసేస్తూ ఏపీ సర్కార్‌ జీవో జారీ చేయడం అమానవీయం. ఇక కర్నూలులో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైంది. హామీలు ఇవ్వడమే కాదు...వాటిని అమలు కూడా చేయాలన్నారు. 

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తాం
 దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. తాను చేప‌ట్టిన‌ ప్రజాసంకల్పయాత్రకు మంచి స్పందన వస్తుంద‌ని చెప్పారు.  ప్రజలు నేరుగా వచ్చి సమస్యలు చెప్తున్నారు. ఎవరు ఏ సమస్య చెప్పినా.. వినడానికి నేను సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పారు. ప్రజల సమస్యలు అన్నింటిని అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామ‌ని చెప్పారు. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు మరింత చేరువగా తెలుసుకునే అవకాశం కలిగింద‌న్నారు.  తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజలు నా దగ్గరకు వస్తున్నారు. అంటే వారి సమస్యలను తీరుస్తానని...వారికి నాపై నమ్మకం ఉన్నట్లే కదా.’ అని అన్నారు. వైయ‌స్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికే వైయ‌స్‌ఆర్‌ జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించామన్నారు. జిల్లాల వారిగా...జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని మాట ఇచ్చారు. 


Back to Top