అన్యాయాన్ని అడ్డుకుందాం కలిసి రండి

హైదరాబాద్‌:

సమైక్యాంధ్ర కోసం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న పోరాటానికి అందరూ కలసిరావాలని జాతీయ స్థాయిలోని అన్ని పార్టీల నాయకులకూ శ్రీ వైయస్‌ జగన్మోహ‌న్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. ‘మేము మీ నుంచి మద్దతు కోరుతున్నాం. సోషల్ మీడియా మద్దతు కూడా కోరుతున్నాం. ప్రజాస్వామ్యంపై విశ్వాస‌ం ఉన్న ప్రతిఒక్కరి మద్దతు మాక్కావాలి’ అని శ్రీ జగన్ అన్నారు. ‌రాష్ట్రంలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని అడ్డుకునేందుకు అందరూ కలిసి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ‘అన్ని పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతల సహకారం మాకు కావాలి. ఎందుకంటే ఇవాళ ఇక్కడ జరిగేది రేపు మరెక్కడైనా జరగవచ్చు' అని ఆయన అన్నారు.
సమైక్యాంధ్రప్రదేశ్‌కు మద్దతు కూడగట్టేందుకు వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ ప్రతినిధి బృందం సోమవారం ఢిల్లీలో వివిధ జాతీయ పార్టీల నేతలతో భేటీ కానున్నది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఈ బృందానికి నాయకత్వం వహిస్తారని ‌శ్రీ జగన్మోహన్‌రెడ్డి సమైక్య దీక్షా వేదికపై జాతీయ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

'ఏ రాష్ట్రాన్నైనా విభజించిన సమయంలో అసెంబ్లీ తీర్మానాన్ని పట్టించుకోని దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు. అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి. ఎందుకంటే అది ప్రజాభిప్రాయానికి అద్దం పడుతుంది..’ అని శ్రీ జగన్ చెప్పారు. 2014 ఎన్నికల తర్వాత ఎవరికి మద్దతిస్తారన్న‌ మీడియా ప్రశ్నకు ఆయన జవాబిస్తూ.. తమ పార్టీ లౌకికవాదానికి కట్టుబడి ఉంటుందని, అలాగే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటామని స్పష్టం చేశారు. అయినా, ఈ కల్లోల సమయంలో తమకు అది అంత ముఖ్యమైన అంశం కాదని అన్నారు. ‘ఎన్నో లౌకిక పార్టీల గురించి నేనెంతో స్పష్టంగా మీకు చెప్పినప్పుడు.. ఆరు నెలల తర్వాత జరగబోయేదానిపై ఇప్పుడెందుకు మనం ఊహాగానాలు చేయాలి...’ అని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత నీళ్లు, రెవెన్యూ పంపకం పెద్ద సమస్యగా మారుతుందని, ప్రజలు నీటి కోసం అలమటించాల్సి వస్తుందని శ్రీ జగన్ స్పష్టం చేశారు.

దీక్షకు విశేష స్పందన‌:
ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా ‌శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న సమైక్యదీక్షకు రెండవ రోజు ఆదివారం ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రాష్ట్రం నలుమూలల నుంచీ తండోపతండాలుగా అభిమానులు, పార్టీ శ్రేణుల తరలి వచ్చి ఆయనకు మద్దతు తెలిపారు. యువకులు, మహిళలు, వృద్ధులు, సాధారణ ప్రజలు ఆసక్తిగా శ్రీ జగన్‌తో కరచాలనం చేసేందుకు ఉత్సాహం చూపించారు. చిన్నపిల్లలను చంకన పెట్టుకుని వచ్చిన తల్లులు దీక్షా ప్రాంగణం పరిసరాల్లో పెద్ద సంఖ్యలో కనిపించారు. తనను కలవడానికి వచ్చిన వారందరినీ శ్రీ జగన్ చిరునవ్వుతో పలకరించారు.‌ పార్టీ ఎం.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, భూమా శోభా నాగిరెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, అంబటి రాంబాబు, జలీల్‌ఖాన్‌, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు శ్రీ జగన్‌ను కలిసి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కె.రఘు రామకృష్ణంరాజు దీక్షా శిబిరాన్ని సందర్శించారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి (కాంగ్రెస్‌) శ్రీ జగన్‌ వద్దకు వచ్చి మద్దతు తెలిపారు.

Back to Top