ఆస్ట్రేలియాలో ఘనంగా వైయ‌స్‌ జగన్‌ జన్మదిన వేడుకలు



హైద‌రాబాద్‌:  వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించారు. వైయ‌స్‌ఆర్‌సీపీ ఎన్ఆర్ఐ శాఖ విక్టోరియా స్టేట్ ప్రెసిడెంట్ సతీష్ పాటి, కన్వినర్ కౌశిక్ మామిడి ఆధ్వర్యంలో మెల్బోర్న్ లోని ప్లంప్టన్ ప్రాంతంలో జరిగిన వేడుకలలో పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొని, పార్టీ జెండాలు చేతపట్టి భారీ కారు ర్యాలీ నిర్వహించారు. జై జగన్ నినాదాలతో హోరెత్తిస్తూ తమ అభిమానాన్ని చాటారు. ఎన్ఆర్ఐ, వైయ‌స్‌ఆర్‌సీపీ కన్వీనర్ కేవీ రమణారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించి మహానేత వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకై కృషి చేయాలనీ పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా సతీష్ పాటి మాట్లాడుతూ రైతుల కోసం, బడుగు బలహీన వర్గాల హితం కోసం నాడు వైయ‌స్ఆర్ ప్రవేశపెట్టిన వివిధ పథకాలను, వాటి వలన జరిగిన లబ్దిని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు రైతులను మరిచి, అధికార గర్వంతో అభివృద్ధిని తుంగలో తొక్కి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్న అధికార టీడీపీకి వచ్చే ఎలక్షన్లలో తగిన బుద్ది చెప్పి, ప్రజా సంక్షేమం మరచిన ఆ పార్టీని భూస్థాపితం చేయాలన్నారు. అందుకు తమ సభ్యులంతా నడుం బిగించి తమ వంతు పాత్రను పోషించాలని పిలుపునిచ్చారు. తమ పూర్తి భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని, దివంగత నేత వైయ‌స్ఆర్ బాటలో నడుస్తూ ప్రజాహితం కోసం సర్వదా పాటుపడతామని పేర్కొన్నారు. కన్వీనర్ కౌశిక్ మామిడి ,విక్టోరియా స్టేట్ యూత్ వింగ్ కన్వినర్ లోకేష్ కాసు, సోషల్ మీడియా ఇంచార్జి రమ్య యార్లగడ్డ, నాయకులు సుబ్బారెడ్డి, పవన్ గోగుల, ఆస్ట్రేలియాలోని వివిధ సంఘాల నాయకులు వెంకట్ నూకల, ఆదిరెడ్డి యారా, ప్రవీణ్ దేశం, కిరణ్ పాల్వాయి, అమరేందర్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.


Back to Top