రాజధాని భూముల కుంభకోణం ఫార్ములాను విశాఖలోనూ వర్తింపజేస్తున్నారనిపించింది..

05–09–2018, బుధవారం,
చిన్నగొల్లలపాలెం క్రాస్, విశాఖ జిల్లా 

ఈరోజు నా పెద్ద కూతురు హర్ష పుట్టిన రోజు. లండన్‌లో చదువుకుంటున్న తను.. సెలవు లు కావడంతో హైదరాబాద్‌కు వచ్చింది. పాద యా త్రలో ఉండటం వల్ల నేను వెళ్లలేకపోయాను. నా మనసు తెలిసిన నా బిడ్డ నా పరిస్థితిని అర్థం చేసుకోగలదన్న నమ్మకం నాకుంది. 

గురువుని దేవునిగా పూజించే సంస్కృతి భారతీయతకు చిహ్నం. నాన్నగారికి విద్యాబుద్ధులు నేర్పి.. తీర్చిదిద్దిన వెంకటప్పయ్య మాస్టారు ఎందరికో ఆదర్శం. వారి పేరుతో స్కూల్‌ పెట్టి.. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తుండటం నాకెంతో తృప్తినిస్తోం ది. అటువంటి గురువులందరినీ స్మరించుకుం టూ.. ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చి, దేశ అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళులర్పించాను. ఈ రోజు గురుపూజోత్సవం సందర్భంగా వివిధ విశ్వవి ద్యాలయాల ఆచార్యులను సన్మానించే అవకాశం రావడం ఆనందం కలిగించింది. 


బకాసురుడిని మించిపోయిన పచ్చనేతల భూ దాహం ఆందోళన కలిగించింది. మభ్యపెట్టో.. మోసపుచ్చో.. బెదిరించో.. పేదల భూముల్ని అప్పనంగా లాక్కుని బినామీలకు దోచిపెట్టడం ఈ పాలనలో ఆనవాయితీగా మారింది. భూము లివ్వని పేదలపై దౌర్జన్యాలు చేయడం, అక్రమ కేసులు బనాయించడం పరిపాటి అయిపోయిం ది. ముదపాక రైతుల పరిస్థితే దీనికి నిదర్శనం. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు దశాబ్దాలుగా సాగు చేసు కుంటున్న భూములపై ప్రభుత్వ పెద్దల కళ్లు పడ్డా యి. వారి బినామీలు రాబందుల్లా వచ్చి వాలిపో యారు. వారి దోపిడీతో తమకు జరుగుతున్న అన్యాయాన్ని మొరపెట్టుకున్నారు ముదపాక రైతన్నలు. తమ బినామీల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం పేదల జీవితాల్ని బలిపెట్టడం అత్యంత దుర్మార్గం. అమరావతిలోని రాజధాని భూముల కుంభకోణం ఫార్ములాను విశాఖలోనూ వర్తింపజేస్తున్నారనిపించింది.  

సింహాచలం దేవస్థాన భూముల వివాదం ఇంకా వీడలేదు. అధికారంలోకి వచ్చాక విశాఖ వచ్చి.. కేబినెట్‌ మీటింగ్‌ పెట్టి.. వంద రోజుల్లోపు పరిష్కరించేస్తానని తీర్మానం చేశారు బాబుగారు. ఇంతవరకూ అతీగతీ లేదు. వివాదాలు పుట్టించి.. సమస్యలు సృష్టించి భూముల్ని లాక్కోవడంలో ఉండే శ్రద్ధ.. పరిష్కరించి న్యాయం చేయడంలో లేదీ పాలకులకు. 


ప్రజాస్వామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛ లేదా? మేనిఫెస్టోలోని హామీలను గుర్తుచేస్తే.. అక్రమంగా నిర్బంధిస్తారా? ముస్లింలకు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే.. దేశద్రోహులుగా చిత్రిస్తారా? నరకయాతనకు గురిచేస్తారా? చావే మేలనేంతగా అవమానిస్తారా?.. ఇదీ ‘నారా హమారా’ సభలో బాబుగారి దాష్టీకానికి బలైన ముస్లిం సోదరుల మనోవ్యథ. పోలీసుల చేతిలో వారు అనుభవించిన చిత్రహింసలు, అవమానాలూ వింటుంటే.. ఇంత రాక్షసత్వమా అనిపించింది. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగినప్పుడు బాబుగారికి ముస్లింలు గుర్తుకురారు. తీరా ఎన్నికలు దగ్గరపడేప్పటికి దిగజారుడు రాజకీయాలకు ఒడిగడుతున్నారు. 

ఈ రోజు మా చిన్నబ్బ డాక్టర్‌ వైఎస్‌ పురుషోత్తం రెడ్డి మృతిచెందారన్న వార్త తెలియగానే.. మనసంతా బాధతో నిండిపోయింది. ఆ మానవతామూర్తి దూరం కావడం.. మా కుటుంబానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించాను. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. రికార్డుల కంప్యూటరీకరణ ముసుగులో గతంలో ఎన్నడూ లేని విధంగా మీ ఈ పాలనలోనే రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి పేదల భూముల్ని అక్రమంగా లాక్కున్నది వాస్తవం కాదా?   
-వైయ‌స్‌ జగన్‌ 


Back to Top