బాబుగారి వంచనకు గురికాని ఒక్క కులమూ లేదంటే అతిశయోక్తి కాదేమో..


 

10–06–2018, ఆదివారం   
గౌరిపల్లి, పశ్చిమగోదావరి జిల్లా


అఖండ గోదావరి తీరం.. గోష్పాద క్షేత్రం ఉన్నటువంటి కొవ్వూరు నియోజకవర్గంలో ఈ రోజు పాదయాత్ర సాగింది. శిబిరం నుంచి బయటకు రాగానే తాడిపర్రు గ్రామానికి చెందిన సోదరుడు నిస్సీకుమార్‌ తన ఇద్దరు చిన్నారులైన ఆడబిడ్డలతో వచ్చి కలిశాడు. మూడునాలుగేళ్ల వయసున్న ఆ పసిబిడ్డలు దేశంకాని దేశంలో.. ఆచూకీ లేని అమ్మకోసం అల్లాడిపోతున్నారని తెలిసి చాలా బాధేసింది. కూలి పనులు చేసుకుని బతికే కుటుంబం వారిది. గల్ఫ్‌ దేశాలకు పోతే బతుకులు బాగుపడతాయని, పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్న ఆశతో.. ఏజెంట్ల మాయమాటలు నమ్మి ఆ బిడ్డల తల్లి ఖతర్‌ దేశానికి పోయిందట.

మొదట్లో అక్కడ శారీరక, మానసిక వేధింపులను భరించలేకపోతున్నానని.. వెనక్కి వచ్చేస్తానని ఏడ్చేదట. ఆ తర్వాత కొద్ది నెలలుగా ఆమె నుంచి ఎలాంటి సమాచారమూ లేదట. ఏజెంట్ల దగ్గరకు వెళ్లి వెనక్కు రప్పించమంటే.. మా బాధ్యత కాదంటున్నారట. దిక్కుతోచని స్థితిలో పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌ ఇస్తే పట్టించుకోవడం లేదట. కారణం.. ఆ ఏజెంట్లకు టీడీపీ నాయకుల అండదండలు ఉండటమేనంటూ కన్నీటి పర్యంతమయ్యాడు నిస్సీకుమార్‌.


స్థానికంగా సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పొరుగు రాష్ట్రాలకు, గల్ఫ్‌ దేశాలకు వలసపోయి పడరాని కష్టాలు పడుతున్నవారి గాథలు వింటుంటే.. మనసంతా కలచివేసింది. మొన్న సురేష్‌గౌడ్‌.. నేడు ఈమె.. ఇలా ఎందరెందరో. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించామంటూ గొప్పలు చెప్పుకొనే పాలకులు క్షేత్ర స్థాయిలో ఉపాధి హామీ పథకం మొదలుకుని.. ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించే అన్ని రంగాలనూ నిర్వీర్యం చేస్తున్నంత కాలం పేదలకు ఈ వలస బాధలు, కన్నీటి వ్యథలు తప్పవు.  

ప్రతిభకు పేదరికమే అడ్డంకిగా మారింది. ప్రభుత్వ ప్రోత్సాహమూ కరువైంది. నిరుపేద కూలి కుటుంబంలో జన్మించిన పరుగుల రాణి నాగాంజలి కష్టం తెలిసి చాలా బాధేసింది. తినడానికి సరిగా తిండిలేకున్నా.. పోటీలకు వెళ్లడానికి ఖర్చులకు సైతం డబ్బు లేకున్నా.. జాతీయ పోటీలలో పాల్గొనడానికి బూట్లు కూడా కొనలేని దుస్థితిలో ఉన్నా.. పట్టుదలతో రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పదుల సంఖ్యలో పతకాలు సాధించిన ఆ చెల్లెమ్మ మట్టిలో మాణిక్యమే.

అటువంటి చెల్లెమ్మ పేదరికం కారణంగా పరుగును ఆపాల్సి వస్తోందని ఆందోళన చెందింది. ‘ప్రభుత్వం నుంచి కనీస ప్రోత్సాహమూ లేదు సార్‌.. మాలాంటి వారికి కాపు కార్పొరేషన్‌ నుంచి కూడా సాయం అందదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు నాగాంజలి తండ్రి. క్రీడాకారులను ప్రోత్సహించడంలో సైతం వివక్ష చూపుతూ, ఓ వైపు.. తనకు రాజకీయ లబ్ధి, ప్రచారము ఉన్నచోట్ల కోట్లు కుమ్మరిస్తూ, మరోవైపు.. ఇలాంటి ప్రతిభావంతులైన గ్రామీణ నిరుపేద క్రీడాకారులను గాలికొదిలేస్తున్న పాలకుల తీరు గర్హనీయం.    

 మల్లవరంలో జరిగిన బీసీల ఆత్మీయ సమ్మేళనంలో ఉన్నంతసేపూ చంద్రబాబు మోసాలు ఒక్కొక్కటీ మదిలో మెదిలాయి. వందలాది సంక్షేమ హాస్టళ్లను మూసివేసి.. బీసీ విద్యార్థులను రోడ్డుపాల్జేయడం గుర్తొచ్చింది. పేద విద్యార్థుల అభ్యున్నతికి జీవనాడి అయిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నీరుగార్చడం వల్ల మధ్యలోనే చదువులు ఆగిపోయిన ఎందరో బీసీ విద్యార్థుల కన్నీటి కథలు గుర్తొచ్చాయి.

బీసీ న్యాయవాదులకు న్యాయమూర్తులుగా నియమితులయ్యే సమర్థత, సచ్ఛీలత లేవంటూ చంద్రబాబు రాసిన లేఖ గుర్తొచ్చింది. మేనిఫెస్టోలో ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించి మోసం చేసిన వైనం, ఇచ్చిన హామీలను గుర్తుచేసిన బీసీలను తాట తీస్తానంటూ బెదిరించిన చంద్రబాబు దురహంకారమూ గుర్తొచ్చాయి.. బాబుగారి వంచనకు గురికాని ఒక్క కులమూ లేదంటే అతిశయోక్తి కాదేమో.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. వెనుకబడిన కులాలవారిపై మీరు కపట ప్రేమ ఒలకబోస్తూ.. వారిని సామాజిక, విద్య, ఆర్థికపరంగా నిజమైన అభ్యున్నతి సాధించనీయకుండా.. కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణించడం నిజం కాదా? మీ రాజకీయ లక్ష్యాలు సాధించుకోవడం కోసం బలహీన వర్గాలను నిచ్చెనమెట్లుగా వాడుకోవడం.. గద్దెనెక్కాక నిచ్చెనను తన్నేసినట్టు వ్యవహరించడం.. మోసం కాదా?
- వైయ‌స్ జ‌గ‌న్‌



Back to Top