కౌలు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం ధర్మమేనా బాబూ?


 
22–05–2018, మంగళవారం
పిప్పర, పశ్చిమగోదావరి జిల్లా

దివ్యాంగులను ఆదరించి, ఆదుకుని ఆత్మస్థైర్యం నింపాల్సిన పాలకులే మోసం చేస్తే.. వారి బాధలు వర్ణనాతీతం. దివ్యాంగులందరికీ యాక్టివా వాహనాలు ఉచితంగా అందజేస్తాం.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండంటూ ఆశపెట్టిందట చంద్రబాబు ప్రభుత్వం. దరఖాస్తు చేసుకున్నాక ఎల్‌ఎల్‌ఆర్‌ కావాలన్నారట. అధికారుల చుట్టూ తిరిగి, అష్టకష్టాలు పడి ఎల్‌ఎల్‌ఆర్‌ తెచ్చుకుని వికలాంగ సంక్షేమ శాఖలో వాకబు చేస్తే.. ముఖ్యమంత్రిగారు ఇస్తే కదా మీకిచ్చేది.. అంటూ నిర్లక్ష్య సమాధానం వచ్చిందని వాపోయాడు పెంటపాడు వద్ద కలిసిన తాటిపర్తి రాజు అనే సోదరుడు. ఇదీ.. దివ్యాంగుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ప్రేమ. అయిదు నెలలు ఎదురుచూసి.. టోల్‌ ఫ్రీ నంబర్‌ 1100కి ఫోన్‌ చేసి సమస్య చెప్పుకొన్నాడట. యాక్టివా వాహనం రాలేదని ఫిర్యాదు చేస్తే.. గ్రామంలో డ్రైనేజీ బాగోలేదని నమోదు చేసుకున్నారట. ఇదీ.. అస్తవ్యస్తమైన బాబుగారి పాలనా తీరు. 

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు నన్ను కలిసిన వరదగోపాల్‌ దంపతుల కన్నీటి కథ నాకు ఇప్పటికీ గుర్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే అరకొర ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సరిపోక చదువెక్కడ ఆగిపోతుందోనన్న దిగులుతో, తనను చదివించడానికి తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూడలేక, వారు అప్పులపాలవడం భరించలేక ఇంజనీరింగ్‌ చదువుతున్న వారి పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కూలీపని చేసుకునే బలహీన వర్గానికి చెందిన ఆ నిరుపేద కుటుంబానికి సత్వర సాయం అందించాలన్న నా ఆలోచనలకు అనుగుణంగా.. మేకపాటి రాజమోహన్‌రెడ్డిగారు స్పందించి ఆపన్న హస్తం అందించారు. ఆ సాయంతో వారి చిన్న కుమారుడు బాగా చదువుకుని 94 శాతం మార్కులు తెచ్చుకున్నాడట. ఆ ఆనందాన్ని నాతో పంచుకోవాలని, కృతజ్ఞత తెలుపుకోవాలని మార్కుల లిస్టు చూపిస్తూ.. ఈ రోజు వారు పడిన తాపత్రయాన్ని చూసి ఎంతో సంతోషపడ్డాను. అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలను పటిష్టంగా అమలు చేసి ఏ తల్లిదండ్రులకూ ఇలాంటి కష్టం రానీయకూడదన్న నా సంకల్పం మరింత దృఢపడింది. 


ముదునూరు దాటాక కలిసిన కౌలు రైతులు తమ కష్టాలు చెప్పుకొచ్చారు. వాస్తవ సాగుదారు అయిన కౌలుదారుకు శ్రమ ఫలితాన్ని నేరుగా దక్కించుకునేందుకు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవకాశాన్నివ్వడం లేదు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ప్రభుత్వం గుర్తించిన కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన తర్వాత ఆ సొమ్మును రాబట్టుకునేందుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ నానా అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. తీరా బ్యాంకు దగ్గరికి వెళ్లాక భూమి సొంతదారు రాకపోయినా, బ్యాంకులో నగదు లేకపోయినా.. రెంటికీ చెడ్డ రేవడి కౌలురైతే కావడం గమనార్హం. ప్రస్తుత నిబంధనల ప్రకారం ధాన్యాన్ని విక్రయించాక ఆ నగదును అధికారులు భూమి పట్టాదారు అయిన రైతు ఖాతాలో జమ చేస్తారు. పంట పండించేది ఒకరైతే.. నగదు జమ అయ్యేది మరొకరి ఖాతాలో. ఇన్ని కష్టాలు పడలేక తక్కువ ధరకే దళారులకు అమ్ముకోవాల్సిన అనివార్యతను ప్రభుత్వమే కల్పించడం శోచనీయం. ఈ పరిస్థితిని నివారించి వాస్తవ సాగుదారుకే నేరుగా నగదు అందించగలిగితే.. కౌలుదారు కష్టాలు కొంతవరకు తీరినట్టే. నాన్నగారి హయాంలో ఇచ్చినట్టుగా ఇప్పుడు కౌలు గుర్తింపు కార్డులు లేవు.. లోన్లూ ఇవ్వడం లేదు. 

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి నాదో ప్రశ్న.. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు అందించి, రుణ సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి మాట తప్పడం ధర్మమేనా? మీ పాలనలో కౌలు పడిపోవడం వాస్తవం కాదా? కౌలు చేయడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితులు నెలకొనడం నిజంకాదా? 
‍వైయ‌స్‌ జగన్‌




Back to Top