ఎల్లో మాఫియా

  • టీడీపీ దోపిడీ పెరిగిపోయింది
  • విచ్చలవిడిగా ఇసుక,మట్టిని దోచేస్తున్నారు
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
గుంటూరు: టీడీపీ నేతలు మాఫియాగా ఏర్పడి ఇసుక, మట్టి దోపిడీలకు పాల్పడుతున్నారని  వైయస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో టీడీపీ దోపిడీ పెరిగిపోయిందని, అధికార పార్టీ నాయకులు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీలోని  అన్ని నదుల్లోంచి ఇసుక దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను మీడియా ప్రతినిధులకు చూపించారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు ఇంటిపక్కనే ఇసుక దోపిడీ జరుగుతోందని వెల్లడించారు.

నదుల పరిరక్షణ గురించి చంద్రబాబు మాట్లాడటం మన దౌర్భగ్యమని అంబటి వ్యాఖ్యానించారు. సాక్షాత్తు నదీ నర్భంలోనే నిర్మించిన ఇంట్లోనే చంద్రబాబు ఉంటున్నారని తెలిపారు. నదుల నుంచి లక్షల కోట్లు దోచుకునే పనిలో పడ్డారని అన్నారు. ర్యాలీ ఫర్‌ రివర్స్‌ పేరుతో చంద్రబాబు హడావుడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. 30 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీలో ఉన్నారని వెల్లడించారు. యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని దుయ్యబట్టారు. వీరిపై ఇప్పటివరకు చర్యలు లేవని తెలిపారు.

ఇసుక మీద వచ్చే ఆదాయంతో డ్వాక్రా మహిళలను లక్షలాధికారులను చేస్తానని ప్రగాల్బాలు పలికిన చంద్రబాబు ఇప్పుడేం చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. ఉచితంగా ఏదీ ఇవ్వకూడదని మనసులో మాట పుస్తకంలో చంద్రబాబు రాసుకున్నారని గుర్తు చేశారు. కమిషన్‌ ఉంటే తప్పా ఏదీ ఇవ్వని పరిస్థితిలో ఆయన ఉన్నారని ఆరోపించారు. అక్రమాలు, అన్యాయాలకు పాల్పడుతూ నీతులు వల్లిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. రెండు ఎకరాల నుంచి వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాల్సిన నైతిక బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు 
Back to Top