మమ్మల్ని నానా మాటలంటే ఒప్పా? జగన్

హైదరాబాద్, ఆగస్టు 22: 'నన్ను హంతకుడని, నా తండ్రిని నరరూప రాక్షసుడని, మా ఎమ్మెల్యేలను స్మగ్లర్లని అంటే ఒప్పయిందా? నన్ను నానా మాటలన్న వారిని ఉద్దేశించి బఫూన్లని నేనన్న ఒక్క మాట తప్పయిందా? వాళ్ళు (టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు) మమ్మల్ని ఉద్దేశించి అన్న వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే...నేనూ అందుకు సిద్ధమే' అని ప్రతిపక్ష నేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

శుక్రవారం అసెంబ్లీ వాయిదా పడిన తరువాత జగన్ తన చాంబర్ లో విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్ధించుకున్నారు. తాను మొత్తం అందరు ఎమ్మెల్యేలను బఫూన్లు అని అనలేదని, మమ్మల్ని ఇష్టమొచ్చినట్లు నిందించిన వారిని మాత్రమే అన్నానని చెప్పారు. 'అసలు బఫూన్ అంటే అర్థం ఏమిటి? సర్కస్ లో జోకర్ అని. అది కూడా సభలో అందరినీ ఉద్దేశించి నేను అనలేదు, ఎవరైతే నానా మాటలు అన్నారో వాళ్ళనే అన్నాను' అని స్పష్టం చేశారు. 'టీడీపీ వాళ్ళు మమ్మల్ని పదే పదే నానా మాటలంటే అది ఆమోదయోగ్యమేనా? మమ్మల్ని ఏటీఎం దొంగలు, స్మగ్లర్లు, దొంగలని అనొచ్చు, అది మీకు న్యాయంగా అనిపిస్తోంది. కానీ నేనన్న ఒకే మాట మాత్రం అన్యాయంగా అనిపిస్తోంది' అని శ్రీ జగన్ స్పీకర్ ను ఉద్దేశించి అన్నారు.

'మమ్మల్ని అన్న అవే మాటలను మా ఎమ్మెల్యేలు...ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి అంటే చూస్తూ ఊరుకునే వారా? అని ప్రశ్నించారు. 'పదే పదే పరిటాల రవి హత్యను నాకు ఆపాదిస్తున్నారు. రవి హత్య జరిగి పదేళ్ళయింది. న్యాయస్థానాల్లో విచారణ జరిగింది. దోషులను నిర్ధారించారు. వారికి శిక్ష కూడా పడింది. అయినా నాపై ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు ఇది అబద్దమని. రవి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జెసి దివాకర్ రెడ్డి, జెసి ప్రభాకర్ రెడ్డిలను టీడీపీలో చేర్చుకుని టికెట్లు కూడా ఇచ్చారు కదా. ఇంకా మాట్లాడ్డం ఏమిటి' అని శ్రీ జగన్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఆ దమ్మూ, ధైర్యం ప్రభుత్వానికి లేవు....

'మూడు నెలలుగా జరుగుతున్న హత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మేం ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, కానీ వారికి ఆ దమ్మూ ధైర్యం లేవు. ఎందుకంటే హత్యకు గురైన వారందరూ వైఎస్సార్సీపీ వారే. హత్య చేసిన వారూ, చేయించిన వారందరూ టీడీపీ వారే. విచారణలో ఈ వాస్తవాలు బయట పడతాయనే వారీ పనికి పూనుకోరు...' అని జగన్ తెలిపారు. హత్యకు గురైన వారి కుటుంబాలకు ఏమైనా మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే 20 లక్షల రూపాయల ఎక్సగ్రేషియో చెల్లించాలని కోరుతున్నట్లు తెలిపారు.

గత మూడు నెలలుగా జరిగిన హత్యలపై సభలో చర్చ జరిగి వారి కుటుంబాలకు ఏదైనా మేలు జరుగుతుందని మేం ఆశిస్తుంటే, అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. 'శాసనసభలో శాంతి భద్రతలపై ప్రస్తుతం జరుగుతున్న చర్చను కనుక టీవీల్లో హత్యకు గురైన వారి కుటుంబాలు చూస్తూ ఉంటే చాలా బాధపడతారు. గతం తవ్వితే మేం వంగవీటి రంగా అంటాం, మీరు పరిటాల రవి అంటారని పలుసార్లు అధికార పక్షానికి మని చేశాం. అయినా వినలేదు' అని శ్రీ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

Back to Top