ఇప్పుడు రక్తం మురిగిపోయిందా బాబు

  • తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని అమ్మేశారు
  • రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
  • బాబు సీఎంగా ఉండడం ప్రజలు చేసుకున్న కర్మ
  • మీడియాతో వైయస్ జగన్ చిట్ చాట్
హైదరాబాద్ః ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని అమ్మేశారని మండిపడ్డారు. జైట్లీ ప్రకటనను స్వాగతిస్తున్నామన్న వ్యాఖ్యలను వెనక్కితీసుకోవాలని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. కేంద్రమంత్రివర్గం నుంచి బాబు తన  మంత్రులను తక్షణమే ఉపసంహరించుకొని ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడిన అనంతరం మీడియాతో వైయస్ జగన్ చిట్ చాట్ చేశారు.  

గతంలో జైట్లీ ప్రకటన చూసి రక్తం మరిగిపోయిందని మాట్లాడిన చంద్రబాబుకు...మరి ఇప్పుడు రక్తం మురిగిపోయిందా అని వైయస్ జగన్ నిలదీశారు. సమస్యను పక్కదారి పట్టించేందుకు బాబు డ్రామాలు ఆడుతున్నారని, ఈ రోజు అదే డ్రామాను బాబు రక్తి కట్టించారన్నారు. బాబు తన మంత్రులను జైట్లీ పక్కన కూర్చోబెట్టి మరీ ప్రకటన ఇప్పించారని విమర్శించారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు 5 కోట్ల మంది ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టారని ఆగ్రహించారు. ఓ పద్ధతి ప్రకారం బాబును హోదాను నీరుగార్చారని మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉండడం ఏపీ ప్రజలు చేసుకున్న కర్మ అని వైయస్ జగన్ అన్నారు. బాబు ఇలానే వ్యవహరిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. 

బాబు రోజుకోమాట...
ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు రోజుకో మాట మాట్లాడుతూ తప్పించుకుంటున్నారని జగన్‌ విమర్శించారు. ఒకసారి ఏమో ప్రత్యేక హోదా సంజీవినా అని.. మరోసారి ప్రత్యేక హోదాతో అన్నీ అయిపోవని.. ఇంకోసారి హోదాకంటే ప్యాకేజీనే మేలని ఇలా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఆంధ్రుల జీవన్మరణ సమస్య అయిన ప్రత్యేక హోదా విషయాన్ని చంద్రబాబు చాలా లైట్‌గా తీసుకున్నారని మండిపడ్డారు. ఇక్కడేమో ప్రత్యేక హోదా కావాలని ఒకసారి.. ప్రత్యేక ప్యాకేజీ కావాలని మరోసారి చెబుతూ  ఢిల్లీకి వెళ్లి తనపై ఉన్న కేసులు కొట్టేయండి అని కేంద్ర మంత్రులకు శాలువాలు కప్పి ఇంగ్లీష్‌లో పొగిడేసి వస్తుంటారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం ఆంధ్ర ప్రజలు చేసుకున్న కర్మ  దుయ్యబట్టారు. 


కేంద్రం కొత్తగా ఇచ్చిందేమీ లేదు
నిన్న కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించిన వాటిల్లో కొత్తగా రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదని జగన్‌ అన్నారు.  అన్నీ కూడా రాష్ట్ర విభజన సమయంలో పేర్కొన్న హామీల్లోవి చదివి వినిపించారన్నారు.  పోలవరానికి రూ. 20వేల కోట్లో.. రూ.30వేల కోట్లు ఇస్తామని చెప్పడం.. రాజధాని నిర్మాణానికి రూ.10వేల కోట్లు ఇస్తామని చెప్పడం ఇలా అన్నీ కలిసి లక్షకోట్లు ఇచ్చామని చెప్పి కలరింగ్‌ ఇచ్చుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు అరుణ్‌జైట్లీ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని చెప్పిన మాటలను వెనక్కి తీసుకుని రాష్ట్ర ప్రజలను క్షమాపణ కోరాలన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ మంత్రులను ఉపసంహరించుకుంటున్నామని కేంద్రానికి అల్టిమేటం జారీ చేయాలన్నారు. ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని బాబు తీర్మాణం చేయాలని జగన్‌ సూచించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడకపోతే మాత్రం చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోవడం ఖాయమని జగన్‌ స్పష్టం చేశారు. 
 


Back to Top