టీడీపీ అరాచకాలపై పోరాడదాం: జగన్

కడప, సెప్టెంబర్ 2: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులను అన్యాయంగా ఇబ్బంది పెడితే ఊరుకోబోమని, అసెంబ్లీలోనూ నిలదీస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా మంగళవారం పులివెందులకు వచ్చిన ప్రతిపక్ష నేత శ్రీ జగన్ ను గుంటూరు, నరసరావుపేట, సత్తెనపల్లి, అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం చెర్లోపల్లె, పెనుగొండ, చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గాలకు చెందిన మహిళలు కలిశారు. వారు శ్రీ జగన్ చేతులు పట్టుకుని బోరున విలపించారు.

ఏమీ చేయకపోయినా అధికార పార్టీ నేతలు తమను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారని...అదను చూసు అక్రమంగా తమపై కేసులు బనాయిస్తున్నారని వాపోయారు. వైఎస్సార్సీపీ తరఫున ఏజెంట్లుగా కూర్చున్నందుకు రేషన్ సక్రమంగా ఇవ్వడం లేదని, ఆఖరికి ఉపాధి హామీ బిల్లులు కూడా సక్రమంగా చెల్లించడం లేదని శ్రీ జగన్ తో వారు మొరపెట్టుకున్నారు. తమ వాళ్ళను జైలుకు కూడా పంపారని కొందరు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

'మంత్రులు సైతం మమ్మల్ని భయాందోళనలకు గురి చేస్తున్నారు' అని చెప్పగా పోలీసులు చర్యలు తీసుకోలేదా? అని శ్రీ జగన్ వారిని ప్రశ్నించారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని వారు చెప్పారు. పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించకపోతే అసెంబ్లీలోనూ గళం విప్పుతామని ఆయన హెచ్చరించారు. ఎవరూ ఎలాంటి భయాందోళనలకు గురి కావలసిన అవసరం లేదని...పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. త్వరలోనే జిల్లాల వారీ సమీక్షలకు వస్తానని, అప్పుడు ఇలాంటి సమస్యలను ప్రస్తావించడంతోపాటు సంబంధింత అధికారులతో కూడా మాట్లాడుతానన్నారు.

Back to Top