స్టే వెకేట్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం

ఏసీబీ కోర్టు జారీచేసిన మెమోపై మాత్రమే హైకోర్టు స్టే ఇచ్చింది తప్ప క్రైం నెంబరు 11 విచారణపై ఎలాంటి స్టే  లేదని.. అందువల్ల తెలంగాణ ఏసీబీ తన కేసు విచారణను కొనసాగించుకోవచ్చని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ కేసు పెండింగ్‌లోనే ఉంటుందని, కేసు విచారణకు ఎలాంటి ఆటంకాలు కలిగించలేదని మరో సీనియర్ న్యాయవాది అరుణ్‌కుమార్ తెలిపారు. హైకోర్టు ఇచ్చినది కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమేనని ఆయన అన్నారు.

చంద్రబాబు ఎప్పటినుంచో మాయమాటలు చెబుతూనే ఉన్నారని, కేసు దాఖలు చేసేటప్పుడే తాము చంద్రబాబును స్టేకు వెళ్లొద్దని చెప్పామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. విచారణను ఎదుర్కోవాల్సిందిగా సవాలు చేశామన్నారు. దోషిగా తేలితే తన భవిష్యత్తు దెబ్బతింటుందన్న భయంతోనే చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారన్నారు. కేవలం ఏసీబీ కోర్టు మెమోపై 8 వారాలు మాత్రమే హైకోర్టు స్టే ఇచ్చిందని, ఈ స్టే వెకేట్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హైకోర్టులో కూడా రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ఆర్కే తెలిపారు. తాము సమర్పించిన సాక్ష్యాలు సరైనవేనని భావించడం వల్లే ఏసీబీ కోర్టు తెలంగాణ ఏసీబీని కేసు పునర్విచారణకు ఆదేశించిందని ఆర్కే గుర్తుచేశారు.

Back to Top