దళితులకు అండగా ఉంటాం

చిత్తూరు: అధికార పార్టీ నాయకుల అరాచకాలకు అమాయకులు బలైతుంటే ఊరుకునేది లేదని, దళితులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. నన్ను నమ్మిన వాళ్లు అన్యాయంగా జైల్లో ఉంటే.. నాకు పండుగ లేదని ఆయన ఆందోళన చేపట్టారు. తప్పు చేసినవారితో పాటు దాన్ని సమర్థించిన వారు కూడా భవిష్యత్తులో పశ్చాత్తాపపడుతారని చెవిచెడ్డి హెచ్చరించారు. అధికారాన్ని అడ్డగోలుగా వాడుతూ.. ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని విచారించకుండానే అమాయక దళితులను అరెస్టు చేయడం పోలీసులకు తగదని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగిందంటే..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వగ్రామం నారావారిపల్లె సమీపంలోని పుదిపట్లలో గురువారం టీడీపీకి చెందిన రెండు వర్గాలు గొడవపడ్డాయి. గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలసి వస్తున్న మణి అనే దళితుడిపై అనుమానంతో పుదిపట్ల సమీపంలో మాజీ మంత్రి గల్లా అనుచరులు దాడికి తెగబడ్డారు.  బాధితులు గల్లా అనుచరులపై ముత్యాలరెడ్డిపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుపై కేసు నమోదు చేయని పోలీసులు శుక్రవారం ఉదయం మణిని, వారి కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు.  సింగపూర్, చెన్నై నుంచి ఎమ్మెల్యే చెవిరెడ్డి కుమారులు సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చారు. అయినప్పటికీ తన నియోజకవర్గ పరిధిలో ఓ దళితుడిని అన్యాయంగా స్టేషన్‌లో ఉంచారని తెలుసుకున్న  చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి శుక్రవారం ఉదయం ముత్యాలరెడ్డి పల్లె పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. బాధితులను వదలాలని కోరారు. వారిని వదిలే వరకు ఎన్ని గంటలయినా.. రోజులయినా సరే ఇక్కడి నుంచి కదిలేది లేదని అక్కడే బైఠాయించారు. అధికార పార్టీ ఒత్తిడితో పోలీసులు అరాచకాలకు పాల్పడితే బాధితులకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత పెద్ద సంఖ్యలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. దీంతో ఉత్కంఠ నెలకొంది. కేసు నమోదు చేయకుంటే జిల్లావ్యాప్తంగా ఆందోళన చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి హెచ్చరించారు. ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, నారాయణస్వామి స్టేషన్‌ వద్దే బైఠాయించడంతో బాధితుడు మణి బంధువు సిద్దముని ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత నిందితులు బడి సుధా యాదవ్, రవీంద్ర, వెంకటముని, గుండ్లూరు శివ, ఈశ్వరయ్యపై కేసు నమోదు చేశారు.

తాజా వీడియోలు

Back to Top