తెలంగాణకు మేం మద్దతు ఇవ్వలేదు

న్యూఢిల్లీ‌, 23 నవంబర్ 2013:

తెలంగాణకు తాము మద్దతు ఇవ్వలేదని జనతాదళ్‌ (యూ) అధ్యక్షుడు శరద్‌ యాదవ్ స్పష్టం చేశారు. అసెంబ్లీని విశ్వాసంలోకి తీసుకోకుండా విభజన ఎలా చేస్తారని ‌ఆయన ప్రశ్నించారు. ప్రజాభిప్రాయం లేకుండా విభజన ఎలా చేస్తారని ప్రశ్నించారు. అసెంబ్లీ తీర్మానాలతోనే ఇంతకు ముందు రాష్ట్రాల విభజనలు జరిగాయని ఆయన గుర్తుచేశారు. సమైక్యాంధ్రకు జాతీయ, ప్రాంతీయ పార్టీల అగ్రనేతల మద్దతు కూడగట్టే క్రమంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని పార్టీ ప్రతినిధుల బృందం శనివారం తనను కలుసుకున్న అనంతరం‌ ‌వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు మద్దతు ఇస్తామా లేదా అనేది పార్లమెంట్లో చెబుతామని శర‌ద్ యాదవ్ అన్నారు. రాష్ట్ర సమైక్యత గురించి‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి తనకు వివరించారని తెలిపారు.

‌అంతకు ముందు శ్రీ జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. విభజనను అడ్డుకోవాలని శరద్ యాద‌వ్ ను కోరినట్లు తెలిపారు.‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులను కలుసుకు‌న్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం, తాజా పరిణామాలపై భేటీ సందర్భంగా శరద్‌ యాదవ్‌కు శ్రీ జగన్‌ వివరించారు.

Back to Top