అన్న రాకకోసం ఎదురుచూస్తున్న పి.గన్నవరం

తూర్పుగోదావరి: జననేత రాకకోసం పి.గన్నవరం నియోజకవర్గం ఎదురుచూస్తోంది. అన్నకు స్వాగతం పలికేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారు. ఇప్పటికే పి.గన్నవరం నియోజకవర్గ కేంద్రమంతా రాజన్న బిడ్డ ఫ్లెక్సీలతో నిండిపోయింది. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా తూర్పు గోదావరిలో అడుగుపెట్టిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్ర బెల్లంపూడి, వైవీపాలెం మీదుగా పి.గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. వైయస్‌ జగన్‌కు స్వాగతం పలికేందుకు ప్రజలు భారీ ఏర్పాట్లు చేశారు. 

జననేత రాకకోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పి.గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్‌ చిట్టిబాబు వెల్లడించారు. వైయస్‌ జగన్‌కు స్వాగతం పలికేందుకు గు్రరాలు, ఒంటెలు, కేరళ, జార్ఖండ్‌ కొమ్మువాయిద్య కళాకారులను రప్పించామన్నారు. నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన జననేతకు ప్రజలు వారి సమస్యలను వివరించనున్నారన్నారు. ముఖ్యంగా లంక గ్రామాల ప్రజలు నేటికీ నాటు పడవలపై ప్రయాణం సాగిస్తున్నారని, వైయస్‌ జగన్‌ సీఎం అయితే వారి చిరకాల కోరిక బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందని వారంతా కోరుకుంటున్నారన్నారు. సాయంత్రం భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top