'ప్రత్యేక హోదా అడిగితే కేంద్రంతో సంబంధాలు తెగిపోతాయని బాబుకు భయం'

విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శుక్రవారం అన్ని ట్రేడ్ యూనియన్లతో విశాఖలో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ, సీఐటీయూ, ఏఐటీయూసీ, డీఎంఎస్ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం వైఎస్ఆర్ సీపీ ఈ నెల 29న ఇచ్చిన బంద్కు అన్ని ట్రేడ్ యూనియన్లు మద్దతిచ్చాయన్నారు.

ప్రత్యేక హోదా వస్తే గ్రాంట్ల రూపంలో 56.25 శాతం అధికంగా వస్తాయని, పన్ను రాయితీలు ఉంటే పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.  ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ ఎలా ఉంటుందో చంద్రబాబు చెప్పాలని విజయ సాయిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా అడిగితే కేంద్రంతో సంబంధాలు ఎక్కడ తెగిపోతాయనే భయం బాబుకు ఉన్నట్లు ఉందని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా సాధించే వరకూ వైఎస్ఆర్ సీపీ పోరాటం చేస్తూనే ఉంటుందని విజయ సాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గౌతంరెడ్డి కూడా పాల్గొన్నారు.
Back to Top