విజయమ్మ నాయకత్వంలో కర్నూలులో ధర్నా

కర్నూలు, 9 జనవరి 2013: ‌‌విద్యుత్ చార్జీల పెంపు ‌ప్రతిపాదన నిర్ణయంపై వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ పోరుబాట పట్టింది. చార్జీల పెంపు ప్రతిపాదనలను నిరసిస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని‌ విద్యుత్ స‌బ్‌స్టేషన్ల ముందు వైయస్‌ఆర్‌సిపి బుధవారం ధర్నాలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్‌ సబ్‌ స్టేషన్లను పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున ముట్టడించారు.

ఈ క్రమంలో కర్నూలు బళ్లారి చౌరస్తాలోని విద్యుత్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీరు కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నా‌కు పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ నాయకత్వం వహించారు. ఇప్పటికే కిరణ్‌ ప్రభుత్వం అడ్డూ అదుపు లేకుండా ఇంధన సర్దుబాటు పేరిట వినియోగదారులపై పెనుభారం మోపుతూ సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది. తాజాగా ఎప్పుడూ లేనట్లుగా విద్యుత్ చార్జీల పెంపునకు కాంగ్రె‌స్ ప్రభుత్వం రంగం సిద్ధం చేయడాన్ని వై‌యస్‌ఆ‌ర్ కాంగ్రె‌స్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విద్యు‌త్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని‌ పార్టీ డిమాండ్ చేసింది.

ధర్నాలో పలువు‌రు స్థానిక వైయస్ఆర్‌సిపి నాయకులు, వందలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విద్యుత్‌ చార్జీలు పెంచాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని ఈ సందర్భంగా పెద్ద పెట్టున వారు నినదించారు.

తాజా వీడియోలు

Back to Top