కుసంస్కారం బయటపెట్టుకున్న జైపాల్‌రెడ్డి

హైదరాబాద్:

కేంద్ర మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి తన కుసంస్కారాన్ని తానే బయటపెట్టుకున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. సీమాంధ్రులను ఉద్దేశించి `శుంఠలు` అని వ్యాఖ్యానించి ఆయన నోటిని ఆయనే కంపుచేసుకున్నారని అన్నారు. జైపాల్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలతో సీమాంధ్రులకు ఎలాంటి నష్టమూ లేకపోయినా, ఆయన స్థాయి మాత్రం పాతాళంలోకి దిగజార్చాయని పద్మ తూర్పారపట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ జైపాల్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

'సాక్షి పత్రిక' లోపలి పేజీల్లో జైపాల్‌రెడ్డి వ్యాఖ్యలను ప్రచురించారు కాబట్టి శ్రీ జగన్‌ సమైక్యవాది కాదు అంటూ టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై వాసిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పత్రికలలో ఏ వార్త ఎక్కడ ఉండాలని చెప్పడం వారి దిగజారుడుతనాన్ని వెల్లడిస్తోందని అన్నారు. చంద్రబాబు చేత సమైక్యం అనే ఒక్క మాట అనిపించలేని వారికి శ్రీ వైయస్‌ జగన్‌ను విమర్శించే అర్హత లేనేలేదన్నారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలిగే శక్తి దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగా శ్రీ జగన్‌కే ఉందని ప్రజలు నమ్ముతున్నారని పద్మ పేర్కొన్నారు. శ్రీ జగన్‌ సమైక్య వాదాన్ని శంకించడం అంటే ఆకాశం మీద ఉమ్మి వేయడమే అవుతుందన్నారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని వైయస్ఆర్‌సీపీ ఆరు నెలలుగా పట్టుపడుతున్నా టీడీపీ నేతలు ముందుకు రావడంలేదన్నారు. ఇదే టీడీపీ వైఖరి ఏమిటో స్పష్టం చేస్తున్నదన్నారు.

Back to Top