వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరిన బలిరెడ్డి సత్యారావు

హైదరాబాద్ : కాంగ్రెస్‌ పార్టీ సీనియ‌ర్ నాయకుడు, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు.‌ విశాఖపట్నం జిల్లాకు చెందిన సత్యారావుతో పాటు ఆయన అనుచరులను పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ‌ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని శ్రీమతి విజయమ్మ నివాసంలో ఈ కార్యక్రమం జరింగింది.

అనంతరం సత్యారావు మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి మృతితో రాష్ట్రం భారీగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహానేత వైయస్ వల్ల లబ్ధి‌ పొందిన వారే అధికార దాహంతో టిడిపితో కుమ్మక్కై ఆయన కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని అన్యాయంగా జైల్లో నిర్బంధించారని విచారం వ్యక్తంచేశారు. పది నెలలు గడుస్తున్నా ఆయనకు బెయిల్ రాకుండా కక్ష సాధిస్తున్నారని ప్రజలంతా అభిప్రాయపడుతున్నారని అన్నారు.

త్వరలో‌ విశాఖ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, కుంభా రవిబాబు, విశాఖజిల్లాకు చెందిన పార్టీ నేతలు పాల్గొన్నారు.
Back to Top