రాష్ట్ర సమైక్యతే మా ఆశయం : శ్రీకాంత్‌రెడ్డి

హైదరాబాద్, 3 సెప్టెంబర్ 2013:

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ ఆశయం అని వైయస్ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. శాసనసభ ప్రాంగణంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమన్యాయానికే ఎప్పుడూ తాము కట్టుబడి ఉంటామని చెప్పారు. విభజన అనివార్యమైతే ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన సమ న్యాయం చేయాలని, అలా చేయలేకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ డిమాండ్ అ‌ని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే తాను సిఎం కావచ్చని కాంగ్రెస్‌ నాయకులు ఎవరికి వారే కలలు కంటున్నారని ఆయన విమర్శించారు.

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ వల్లే రాష్ట్రంలో ప్రస్తుత క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే అందుకు వ్యతిరేకంగా చంద్రబాబు‌ తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి మరీ కాపాడారని చెప్పారు. ఒక ప్రతిపక్ష పార్టీ ఈ విధంగా చేయడం  ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదన్నారు. టిడిపి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రత్యేక రాష్ట్రం అంశాన్ని పెట్టిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చట్టపరమైన, పాలనాపరమైన చర్యలు తీసుకుంటామని దానిలో పేర్కొన్నట్లు తెలిపారు.

సమైక్యాంధ్ర కోసం తమ పార్టీ ఎమ్మెల్యేలందరూ చేసిన రాజీనామాలను ఆమోదింపజేసుకుంటామని అమర్నాథరెడ్డి చెప్పారు. టిడిపి ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేయాలని ఆయన ‌పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనకకు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చిత్తశు‌ద్ధితో పోరాటం చేస్తున్నది ఒక్క వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే అని ఆయన తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top