భవిష్యత్తరాలకు ఏమి సమాధానం చెప్పగలం?

హైదరాబాద్ :

రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయకపోతే భావితరాలు మనలను క్షమించబోవని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ అన్నారు. వై‌యస్ఆర్‌ కాంగ్రెస్ శాసనసభా‌ పక్షం కార్యాలయంలో ఆమె మంగళవారంనాడు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బిల్లుపై చర్చకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకం కాదని, అయితే అంతకు ముందు సమైక్య తీర్మానం చేయాలన్నారు. అందు కోసం తామంతా పట్టుపడతామని శ్రీమతి విజయమ్మ స్పష్టం చేశారు.

గతంలో బీహార్ రాష్ట్రం నుంచి జార్ఖం‌డ్‌ను ఏర్పాటు చేసినపుడు అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజన బిల్లు వస్తే వెనక్కి తిప్పి పంపిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. అసెంబ్లీ తీర్మానం చేసిన తరువాతనే విభజన బిల్లుపై అక్కడ చర్చ జరిగిందన్నారు. విభజన ప్రక్రియ ఎలా జరిగిందో అధ్యయనం చేయడానికి బీహార్‌ వెళ్లిన అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహ‌ర్‌కు ఈ విషయం తెలియదా అని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు. తీర్మానం లేకుండానే బిల్లుపై చర్చిస్తే భవిష్యత్తులో ఏం సమాధానం చెబుతామని ఆమె ప్రశ్నించారు. బీఏసీ సమావేశంలో తాను ఇదే విషయం చెప్పినప్పుడు ఇతర పక్షాలు సరైన రీతిలో స్పందించలేదన్నారు.

జస్టిస్ సర్కారియా, జస్టి‌స్ పూంచి కమిషన్లు రెండూ ఆర్టికల్ 3 కింద రాష్ట్ర విభజన చేయాలంటే ఒక ప్రాతిపదిక ఉండాలన్న విషయాన్ని శ్రీమతి విజయమ్మ ప్రస్తావించారు. ఏదైనా కమిటీ సిఫార్సు చేయడం గాని, సంబంధిత అసెంబ్లీ తీర్మానం గానీ ఉండాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రాతిపదిక ఏదీ లేకుండా విభజన బిల్లును నేరుగా పంపడం పట్ల‌ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఒప్పుకుంటే అందరూ వైయస్ఆర్‌సీపీలో చేరతారు :
కాంగ్రెస్ ఎమ్మెల్యేల వలసల విషయ‌ం మీడియా ప్రతినిధులు శ్రీమతి విజయమ్మ దృష్టికి తీసుకువచ్చినప్పుడు ‘మేం ఒప్పుకుంటే అందరూ మా పార్టీలోకే వస్తారు’ అని సమాధానమిచ్చారు. ఇతర పార్టీల్లోని సీనియర్లు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌లోకి రావాలనుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై వివిరణ కోరినప్పడు ‘సీనియర్లు వస్తారని చెప్పి ప్రారంభం నుంచీ మా పార్టీలోనే ఉన్న నాయకులను పక్కనపెట్టలేం కదా?’ అన్నారు. నాలుగేళ్లుగా తమ వెంట ఉండి, పార్టీ అభివృద్ధి కోసం కృషిచేసిన వారిని వదులుకోబోమని శ్రీమతి విజయమ్మ స్పష్టం చేశారు.

Back to Top