చంద్రబాబు గుండెల్లోకి బుల్లెట్లా దూసుకెళతాం

చంద్రబాబు గుండెల్లోకి బుల్లెట్లా దూసుకెళతాం
► మాకు అడవి కన్నతల్లిలాంటిది
► మన్యం జోలికి వస్తే ఖబర్దార్ జాగ్రత్త: మన్యం పౌరులు

చింతపల్లి: బాక్సైట్ జోలికి వస్తే కత్తులు దూస్తాం కబర్దార్ అని విశాఖ ఏజెన్సీలో మన్యం ప్రాంతానికి చెందిన చిన్నబ్బాయ్ అనే వ్యక్తి అన్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ జోలికి వస్తే ఏమాత్రం సహించేది లేదని చెప్పాడు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకోసం విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో వైఎస్సార్సీపీ నిర్వహించిన బహిరంగ సభలో చిన్నబ్బాయ్ తో సహా పలువురు మన్యం పౌరులు మాట్లాడారు.

తాము ఇక్కడే పుట్టి పెరిగి చదువు సంద్యలు లేకుండా ఉన్నామని, ఈ కొండలను నమ్ముకొని జీవిస్తున్నామని, అలాంటి మాకు ఏం బహుమానం ఇవ్వాలనుకొని బాక్సైట్ తవ్వకాలు జరుపుతారని ప్రశ్నించారు. దయచేసి తమ భూముల కోసం, ఆస్తుల కోసం, మన్యంకోసం ఆశపడవొద్దని, ఇక్కడ నుంచి తమను తరలించి ఎక్కడో పడేయాలని చూడొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. పాడేరు మండలానికి చెందిన రత్నాబాయి మాట్లాడుతూ జొర్రెళ్ల మైనింగ్ పై చంద్రబాబు కన్నేశారని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలు జరిపితే విషవాయువులు వచ్చి చనిపోతామని చంద్రబాబుకు ఆ విషయం ఎందుకు అర్థం కావడం లేదని చెప్పారు.

ఈ సందర్భంగా మన్నెం ప్రాంతంతో తమకు అల్లుకుపోయిన బంధాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. 'మనం అడవి తల్లికి పుట్టిన బిడ్డలం. అడవి తల్లి ఇచ్చిన కూరలు తిని బతుకుతున్నాం. మన దుంపలు మనం తింటున్నాం.. చెంబెడు నీళ్లు తాగి బతుకుతున్నాం. మాకు బతుకునిస్తున్న అడవి తల్లిని చంద్రబాబునాయుడు తవ్వుకుంటాడా. ఖబర్దార్ చంద్రబాబునాయుడు' అని ఆమె హెచ్చరించారు. ఆదివాసీలదే అడవి అని రాజశేఖర్ రెడ్డి చెప్పిన మాటను గుర్తు చేశారు.

సూరి అనే వ్యక్తి మాట్లాడుతూ ఈ 11మండలాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభావాన్ని వైఎస్ జగన్ పారద్రోలతారని విశ్వాసం వ్యక్తం చేశాడు. బాక్సైట్ తవ్వకాలు జరిపితే చంద్రబాబు గుండెల్లోకి ఒక్కో గిరిజనుడు బుల్లెట్ల మాదిరిగా దూసుకెళ్లాలని చెప్పాడు. విజయకుమారి అనే జరర సర్పంచి మాట్లాడుతూ తమ గ్రామాలే బాక్సైట్ తవ్వకాలకు అనుమతిచ్చినట్లు చంద్రబాబునాయుడు శ్వేతపత్రం విడుదల చేశారని, కానీ, అసలు తాము గ్రామసభలే నిర్వహించలేదని, తీర్మానాలే చేయలేదని చెప్పారు. చంద్రబాబు శ్వేతపత్రంలో ప్రకటించినవన్నీ అబద్ధాలే అన్నారు.
Back to Top