సమైక్య శంఖారావం ‌.. ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్, 26 అక్టోబర్ 2013:

వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ శనివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం ‌బహిరంగ సభ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో నగర పోలీసు కమిషనర్ ట్రాఫి‌క్ ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. మరో పక్క స్టేడియం లోపలకు ప్రవేశించే ప్రముఖులు, అభిమానులు, కార్యకర్తలు, మహిళలకు ప్రత్యేక ప్రవేశ ద్వారాలు నిర్దేశించారు.

మళ్లింపులు ఇలా :
నాంపల్లి, పోలీసు కంట్రోల్‌రూమ్‌ల వైపు నుంచి వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రో‌ల్ పం‌పు చౌరస్తా నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు అనుమతించరు.‌ సుజాత స్కూల్, చర్మాస్‌ల వైపు నుంచి వచ్చే వాహనాలు బీజేఆర్ స్టాట్యూ వైపు అనుమతించరు. వీటిని గ‌న్‌ఫౌండ్రి ఎస్బీహెచ్ నుంచి అబి‌డ్సు వైపు మళ్ళిస్తారు. సిమెట్రీ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను ఓ‌ల్డు ఎమ్మెల్యే క్వార్టర్సు చౌరస్తా నుంచి హిమాయత్‌నగర్ ‘వై’ జంక్ష‌న్ వైపు పంపిస్తారు. రా‌జ్‌మొహల్లా రోడ్డు నుంచి ఓల్డు ఎమ్మెల్యే క్వార్టర్సు వైపు వచ్చే వాహనాలను సిమెట్రీ నుంచి మళ్లిస్తారు.

 బొగ్గులకుంట, తాజ్‌మహల్, ఈడెన్‌గార్డెన్సు, కింగ్ కోఠి వైపు నుంచి వచ్చే వాహనాలను బషీ‌ర్‌బాగ్ వైపు అనుమతించరు. వీటిని కింగ్ కోఠి క్రా‌స్‌రోడ్సు నుంచి అబిడ్సు తాజ్‌మహల్ హోట‌ల్ వైపు మళ్లిస్తారు.‌ అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి బషీ‌ర్‌బాగ్ జంక్ష‌న్ వైపు వచ్చే వాహనాలను లిబర్టీ చౌరస్తా నుంచి హిమాయ‌త్‌నగర్ వైపు మళ్లిస్తారు.‌ రవీంద్రభారతి, నాంపల్లి వైపుల నుంచి వచ్చే వాహనాలను ఓల్డు కంట్రోల్‌రూమ్ మీదుగా బషీ‌ర్‌బాగ్ వైపు అనుమతించరు.‌ సాధారణ వాహనచోదకులు స్టేడియానికి నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఉన్న మాసబ్‌ట్యాంక్, వీవీ స్టాట్యూ, ట్యాంక్‌బండ్, ఆర్టీసీ క్రాస్‌రోడ్సు, ఏంజే మార్కెట్ మార్గా‌ల్లో రావవద్దని పోలీసులు సూచించారు.

ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నగర పోలీసులు విధించిన ఆంక్షలకు నగరవాసులు, సభకు తరలి వచ్చే వారు సహకరించాలని పోలీసులు కోరారు. నిబంధనలను కచ్చితంగా పాటించి కార్యక్రమం ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించాలని సూచించారు.

Back to Top