రేపు గుంటూరులో వంచ‌న‌పై గ‌ర్జ‌న దీక్ష‌



- వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌
- టీడీపీ నేత‌లు పంచభూతాలను వదలకుండా తినేస్తున్నారు
-  రైతాంగానికి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భరోసా ఇస్తున్నారు
 

గుంటూరు :  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వంచనకు నిరసనగా రేపు గుంటూరులో వంచనపై గర్జన నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు  వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష ఉంటుదని, ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ మోసాలను ఎండగడతామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలంతా హాజరవుతారని పేర్కొన్నారు.బుధ‌వారం గుంటూరులో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఒక పక్క రాష్ట్రంలో కరువు ఉంటే దీన్ని అవకాశంగా తీసుకొని రైన్‌ గన్ల కోసం రూ.1600 కోట్లు దోచుకునేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. ఇటీవల టీడీపీ మంత్రులు  విఫరీతంగా ఫోటోలకు ఫోజులిస్తు ప్రజాధనాన్ని దోచుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కరువును తరిమికొట్టేందుకు జలయజ్ఞం కార్యక్రమం చేపడితే..టీడీపీ మంత్రి దేవినేని ఉమా ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 14 లక్షల ఎకరాల్లో సాగునీటి విస్తిర్ణం తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
అడ్డ‌గోలుగా దోపిడీ
గుంటూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దోచుకుంటున్నారని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసినా యథేచ్చగా దోపిడీ చేస్తున్నారని తెలిపారు. మరో టీడీపీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్‌ ఇసుక మాఫియాతో కోట్లు దోచుకుంటున్నారని, ధూళిపాళ్ల నరేంద్ర నీరు చెట్టు పథకంతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. మిగిలిన ఎమ్మెల్యేలు పంచభూతాలను వదలకుండా తినేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో ఎక్కడ చూసిన అవినీతి కంపు కొడుతుందన్నారు. గుంటూరు జిల్లాలో శాంతి భద్రతలే లేవన్నారు.

చీమ కుట్టిన‌ట్లు కూడా లేదు..
రాష్ట్రంలో 400 మండలాలు కరువుతో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు రైతాంగం సంక్షోభంలో ఉంటే సీఎం చంద్రబాబు మాత్రం రూ.1600 కోట్లతో రెయిన్‌ గన్స్‌తో దోపిడీకి సిద్దమయ్యారని ఆరోపించారు. ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ఉమా మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు మాత్రం గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. లక్షలాది ఎకరాల్లో సాగు తగ్గి, రైతులు పంట నష్టపోయినా ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. రైతాంగానికి తమ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భరోసా ఇస్తున్నారని తెలిపారు. ఈ అరాచకాలు, దోపిడీ, అవినీతిపై తమ పోరాటం కోనసాగుతుందని స్పష్టం చేశారు.


Back to Top