సిద్దాపురం ఎత్తిపోత‌ల మ‌హానేత చ‌లువే


- నేడు వైయ‌స్ఆర్‌ గంగాహారతి
- వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల పార్ల‌మెంట‌రీ జిల్లా అధ్య‌క్షుడు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి 
 
క‌ర్నూలు:  ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువు వద్ద మంగళవారం ‘వైయ‌స్ఆర్‌ గంగాహారతి’ కార్యక్రమాన్ని భారీఎత్తున నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి చలువ వల్లే సిద్ధాపురం ఎత్తిపోతల పథకం పూర్తయ్యింది. దీనివల్ల వేలాది ఎకరాల భూములు సస్యశ్యామలం కానున్నాయి. ఈ నేపథ్యంలో వైయ‌స్ఆర్‌  సహకారాన్ని స్మరించుకుంటూ వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో  ‘వైయ‌స్ఆర్‌ గంగాహారతి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన మూడు రోజులుగా ఆత్మకూరులోనే మకాం వేసి..  ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.   మండు వేసవి కావడంతో  గంగాహారతిలో పాల్గొనేందుకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సిద్ధాపురం చెరువు వద్ద సభాస్థలిని సిద్ధం చేశారు. సుమారు 20వేల మంది కూర్చునేందుకు వీలుగా విశాలమైన చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. మధ్యాహ్న భోజన ఏర్పాట్లు కూడా ఘనంగానే ఉన్నాయి.  

వైయ‌స్‌ఆర్‌ గంగాహారతి కార్యక్రమంలో బోనాలను ఎత్తడానికి సుమారు 1,200 మంది మహిళలు ఇప్పటికే నిర్వాహకుల వద్ద నమోదు చేసుకున్నారు. సంజీవ్‌ నగర్‌ తండా నుంచి మహిళలు బోనాలను తీసుకుని ఊరేగింపుగా సిద్ధాపురం చెరువు వైపు సాగుతారు. నేరుగా కట్టమీదకు వెళ్లిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన గంగమ్మ విగ్రహం వద్ద బోనాలను సమర్పిస్తారు. అలాగే యాగంలో పాల్గొని దీపాలను చెరువులో వదలనున్నారు.  ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వైయ‌స్ఆర్‌సీపీ  ప్రముఖ నాయకులు భారీ సంఖ్యలో విచ్చేస్తున్నారు.   

Back to Top