కమీషన్‌ల కోసం టెండర్‌ రద్దు చేస్తారా?

హైదరాబాద్‌: కమీషన్‌ల కోసం చంద్రబాబు విజయనగరంలో ఏర్పాటు చేయబోతున్న భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్‌ను క్యాన్సల్‌ చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం రాష్ట్రానికి ముప్పని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్‌లో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఒక ప్రైవేట్‌ సంస్థ ఈ టెండర్‌లో పాల్గొన్నాయన్నారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా 30.2 శాతం ప్రభుత్వానికి ఇస్తామని చెప్పింది. అలాగే ప్రైవేట్‌ సంస్థ పాల్గొని 21.6 శాతం ఇస్తామని ప్రకటించిందని అంబటి చెప్పారు. సహజంగా 30.2 శాతం ఇస్తామన్న సంస్థకు టెండర్‌ ఇవ్వాలని, అది ప్రభుత్వ సంస్థ కాబట్టి చంద్రబాబుకు ఫండింగ్, సూట్‌కేసులు ఇవ్వరు కాబట్టి టెండర్‌ నిర్ణయాన్ని క్యాన్సల్‌ చేశారని మండిపడ్డారు. టీడీపీ ఎంపీ ఆధ్వర్యంలోనే ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా సంస్థ నడుస్తుందన్నారు. కేవలం ఎయిర్‌పోర్టు అథారిటీ ఇండియా కమీషన్‌లు ఇవ్వదు కాబట్టి భూసేకరణ కంప్లీట్‌ కాలేదని వంకలు పెట్టి రద్దు చేశారన్నారు. ప్రైవేట్‌ కంపెనీలకు ఇచ్చి వందల కోట్లు కమీషన్‌లు దండుకోవాలనే దుర్భద్దితో చంద్రబాబు ఆలోచన చేశారన్నారు. 

తాజా వీడియోలు

Back to Top