టీడీపీది దోచుకో–దాచుకో పద్ధతి

ప‌శ్చిమ గోదావ‌రి:  తెలుగు దేశం పార్టీ నేత‌లు దోచుకో-దాచుకో ప‌ద్ధ‌తి అవ‌లంభిస్తూ ప్ర‌జాధ‌నాన్ని లూటీ చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల‌నాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఇకపై సాగనివ్వబోమని, టీడీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని ఆయ‌న టీడీపీ శ్రేణులను హెచ్చరించారు. నల్లజర్లలో పార్టీ గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు అధ్యక్షతన నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ముందుగా దివంగత సీఎం వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంత‌రం కేంద్ర మాజీమంత్రి, సినీ దర్శకుడు దాసరి నారాయణరావు మృతికి సంతాపం తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ అవినీతి, అక్రమాలపై నిలదీస్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల‌పై అక్ర‌మ‌ కేసులు బనాయించి ఇబ్బందులు పాల్జేస్తున్నారని, ఇకపై ఇటువంటివి సాగనివ్వబోమని హెచ్చరించారు. భ‌విష్య‌త్ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని, వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.
Back to Top