టీడీపీ డేరాబాబాలకు దేహశుద్ధి తప్పదు

  • ఇంటింటికీ ప్రచారానికి వెళితే అవమానం తప్పదు
  • రైతులు, డ్వాక్రా మహిళలు, యువత అందరూ తరిమికొడతారు
  • మళ్లీ తప్పుడు వాగ్ధానాలు కురిపించేందుకే బాబు కుట్రలు
  • ప్రతి ఇంటికి రూ.80 వేలు బాకీ పడ్డ చంద్రబాబు
  • వైయస్‌ఆర్‌ హయాంలో ప్రతి ఇంటికి పథకాలు వెళ్లాయి
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌
విజయవాడ: మూడున్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయలేని టీడీపీ డేరాబాబాలు, వారి గురువులు ఇంటింటికీ ప్రచారానికి వస్తే ప్రజలంతా దేహశుద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ అన్నారు. ఏం సాధించారని ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం చేపట్టారని చంద్రబాబును నిలదీశారు. విజయవాడ వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో జోగి రమేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటింటికీ కార్యక్రమంలో డేరాబాబాలు వారి గురువులు చంద్రబాబా, లోకేష్‌బాబా, ఉమాబాబా, సోదిరెడ్డిబాబా అందరూ ఆరు కోట్ల తెలుగు ప్రజల గడప గడపకూ రాబోతున్నారని, ఎన్నికల్లో తప్పుడు హామీలిచ్చి మోసం చేసిన బాబాలను ఏం చేయాలో ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. ప్రతిపక్షంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం పెడితే ప్రజలంతా ఆదరించారని గుర్తు చేశారు. కానీ ఓట్ల కోసం వాగ్ధానాలిచ్చి మాట తప్పిన టీడీపీ నేతలను తరిమికొడతారని హెచ్చరించారు.  

చీపురుకట్టలతో తరిమికొడతారు.. 
ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతు రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిన టీడీపీ బాబాలను రైతన్నలు తరిమికొడతారన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల ముందు పాదయాత్ర చేస్తూ మరీ చెప్పిన చంద్రబాబు ఈనాటి వరకు డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు మాఫీ చేయలేదని జోగి రమేష్‌ ధ్వజమెత్తారు. ఇంటింటికీ వెళ్లి మళ్లీ అబద్ధాలు చెప్పే బాబాలను మహిళలు చీపురుకట్టలతో తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంటికో ఉద్యోగం, లేకపోతే నిరుద్యోగభృతి ఇస్తానని మోసం చేసిన టీడీపీ నేతలు ఇంటింటికీ వెళితే.. యువత క్రికెట్‌ బ్యాట్‌లతో కొడతారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 40 నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఏ ఒక్కరికి నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. అంటే చంద్రబాబు ప్రతి ఇంటికి రూ.80 వేలు బాకీ పడ్డారన్నారు. ఇంటింటికీ ప్రచారంలో టీడీపీ బాబాలు పాల్గొంటే కాలర్‌ పట్టుకొని నిరుద్యోగులు భృతి ఏదంటే ఏం సమాధానం చెబుతారన్నారు.  

175 అసెంబ్లీ స్థానాలు మీవే అయినప్పుడు ప్రచారం ఎందుకు
దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీ నాయకులు ఎవరూ గడప గడపకూ వెళ్లలేదని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రతీ ఇంటికి వెళ్లాయని జోగి రమేష్‌ గుర్తు చేశారు. ఉచిత విద్యుత్, విద్య, తెల్ల కార్డు, ఆరోగ్యశ్రీ, పెన్షన్, ఇళ్ల స్థలాలు, ఇల్లు వంటివి ప్రతి ఒక్కరికి చేరాయన్నారు. నువ్వేం చేశావు చంద్రబాబు అని ప్రశ్నించారు. 175 నియోజకవర్గాలు మావే అని చెప్పుకుంటూ మళ్లీ ఇంటింటికీ ఎందుకు బయల్దేరారని నిలదీశారు. కర్ణాటకకు ఏపీ యువత ఉద్యోగాలకు వెళితే వారి దరఖాస్తులను చించేస్తుంటే సిగ్గు అనిపించడం లేదా అని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఏలో భాగస్వామిగా ఉండి ఉద్యోగాలు కూడా ఇప్పించలేవా అని నిలదీశారు. తుంగభద్ర, ఆల్మట్టి నుంచి నీళ్లు అడిగేందుకు నోరు ఎందుకు పెకలడం లేదని బాబుపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు సోనియాగాంధీకి సాగిలాపడ్డాడని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ డేరాబాబాలు ఇంటింటికీ వస్తే ప్రజలు నిలదీయాలన్నారు.

తాజా వీడియోలు

Back to Top