టీడీపీ నేత‌లు ద‌ద్ద‌మ్మ‌లు-ఎమ్మెల్యే రోజా

విశాఖపట్నం:  తెలుగుదేశం నేత‌లు చేత‌గాని ద‌ద్ద‌మ్మ‌లు అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అభిప్రాయ పడ్డారు. అందుకే రాష్ట్రంలోని స‌మ‌స్య‌ల మీద త‌మ పార్టీ పోరాడుతోంద‌ని ఆమె వివ‌రించారు. విశాఖ‌లో  ప్రత్యేక రైల్వేజోన్ కోసం నాలుగురోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న గుడివాడ అమర్నాథ్కు ఆమె ఆదివారం సంఘీభావం తెలిపారు. 
 తెలుగుదేశం పార్టీలో మగాళ్లు లేరు కాబట్టే.. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను చంద్రబాబు తీసుకెళ్తున్నారని ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలని ఆమె సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు ఓటుకు నోట్లు కేసులో అడ్డంగా ఇరుక్కున్నాడు కాబట్టే.. ఆంధ్రప్రదేశ్ను ఆయన కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని రోజా మండిపడ్డారు.
రైల్వే జోన్ వస్తే ఉద్యోగవకాశాలు పెరుగుతాయని, పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయన్న ఆమె.. రైల్వే జోన్ సాధించే వరకు వైఎస్ఆర్ సీపీ పోరాడుతుందని, దీనికి అందరూ కలిసిరావాలని కోరారు. అడ్డదిడ్డంగా మాట్లాడే అచ్చెన్నాయుడు ఏనాడైనా రైల్వే జోన్ కోసం పోరాడారా అని రోజా ఈ సందర్భంగా ప్రశ్నించారు. మంత్రులు గంటా శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు పోటీపడి దోచుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఉత్తరాంధ్ర మంత్రులకు రైల్వేజోన్ వ్యవహారం పట్టదా అని ఆమె నిలదీశారు.  చంద్రబాబు రూ. 10 వేల కోట్లు ఇవ్వమని కోరితే.. కేంద్రం రూ.700 కోట్లు ఇచ్చిందని రోజా తెలిపారు.  చంద్రబాబు సీఎం కావడం ఏపీకి శాపం అని రోజా విమర్మించారు.

Back to Top