కార్మికుల పొట్టేకొట్టే విధానాలు అమలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వం

నగరంపాలెంః టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కార్మికుల పొట్టకొట్టే విధానాలను అమలుపరుస్తుందని వైయస్సాఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్ది ధ్వజమెత్తారు. పురపాలక, నగరపాలక సంస్థల్లో పారిశుద్ధ్యం ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు విడుదల చేసిన జీవో 279 ని రద్దు చేయాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు పనికి సమానమైన వేతనం పై విడుదల చేసిన జీవో 151ను అమలు పరచాలనీ కొరుతూ మున్సిపల్‌ కార్మికుల జెఏసీ అధ్వర్యంలో మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మున్సిపాల్టీలో దశాబ్దలుగా పారిశుద్ధ్యం విభాగంలో పనిచేస్తున్న బడుగు, బలహీన వర్గాలకు చెందిన కార్మికులను బడా కాంట్రాక్టర్లకు బానిసలుగా మార్చేందుకే జీవో 279ని అమలు చేస్తున్నారన్నారు. కార్మిక సంఘాలు, వివిధ రాజకీయపార్టీలు దీని వలన రాష్ట్రంలో 50వేల కార్మికుల ఉపాధి భద్రత అగమ్యగోచరంగా మారుతుందని ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించిన కుట్రపూరితంగా, దురాలోచనతో బలవంతంగా జీవోను అమలు చేయాలని చూస్తున్నారన్నారు. కార్మికుల సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనీ తొమ్మిదినెలల క్రితం జారీ చేసిన జీవో 151ను ప్రభుత్వం వెంటనే అమలుపరచాలనీ డిమాండ్‌ చేశారు. కార్మికులు న్యాయమైన సమస్యల పరిష్కారం కొసం చేస్తున్న అందోళన కార్యక్రమాలకు వైఎస్సాఅర్‌సీపీ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం స్పందించి కార్మికుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని జీవోను రద్దు చేయకపోతే అందోళనలను ఉధృతం చేసి ప్రభుత్వాన్ని స్థంబింప చేస్తామని హెచ్చరించారు. ఏపి మున్సిపల్‌ వర్కర్స్, ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి, మున్సిపల్‌ కార్మికుల జెఏసీ రాష్ట్ర కన్వీనర్‌ కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 279 జీవోను అమలు చేయటం వలన కార్మికుల ఉపాధితో పాటు, నగర ప్రజలకు అదనపు సర్వీస్‌ చార్జి పేరుతో పన్నుల భారం లక్షల కోట్లు రుపాయలు పడుతుందన్నారు. ప్రస్తుతం పారిశుద్ధ్యం కాంట్రాక్టులు నిర్వహించే సొసైటీలకు ఐదుశాతం రాయల్టీ ఇస్తున్న ప్రభుత్వం, నూతన విధానంలో మాత్రం బడా కార్పోరేట్‌ కంపెనీలతో లాలూచీ పడీ ఎకంగా 15శాతం కి పెంచేశారన్నారు. ప్రైవేటు సంస్థలకు లబ్ది చేకూర్చేలే అర్థికస్తొమత లేని చిన్న చిన్న మున్సిపాల్టీలపై ఒత్తిడి తెచ్చి మరీ బారీ మిషన్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తుందన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టు కార్మికులకు 50 శాతం జీతాలు పెంచుతూ ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. ప్రభుత్వం కార్మికుల, ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోకపోతే రాష్ట్రస్థాయిలో అందోళను ఉధృతం చేస్తామన్నారు. సిపిఐ జిల్లా నాయకులు నేతాజీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామని, ఇంటింటింకి ఒక ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చిన వాటిని పూర్తిగా విస్మరించి బాధ్యతరాహిత్యంగా పరిపాలన సాగిస్తుందన్నారు. జీవో 279 అమలు చేసి పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం నుంచి ప్రభుత్వం తప్పుకునేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ది గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇంజనీరింగ్‌ కాంట్రాక్టు వర్క్‌ర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు ఈదులమూడి మధుబాబు మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు వర్కర్లుకు జీవో 151 ప్రకారం స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్‌స్కిల్డ్‌ కేటగిరిలుగా వేతనాలు అందించాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎస్‌సీ సెల్‌ అధ్యక్షులు కొరివి వినయ్‌కుమార్‌ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం నిరుపేద దళిత వర్గాలకు చెందిన కార్మికుల వ్యతిరేకంగా అమలు చేస్తున్న విధానాలను రద్దు చేయాలని చేస్తున్న అందోళనలకు కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతు అందిస్తుందన్నారు.

నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద రాస్తారోకో, ముట్టడి
జీవో 279ని రద్దు చేయాలని కొరతూ రీజినల్‌ కార్యాలయం పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన పారిశుద్ధ్య కార్మికుల తొలుత ఎసీ కళాశాల నుంచి ర్యాలీగా నగరపాలక సంస్థ కార్యాలయం చేరుకొని కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. కార్మికుల జీవితాలను ప్రశ్నర్థకంగా మార్చే జీవోను రద్దు చేయాలని, ప్రభుత్వ నిరంకుశ ధోరణి నశించాలనీ, గ్రూప్‌ అఫ్‌ మినిస్టర్స్‌ డౌన్‌డౌన్‌అని, మంత్రులు నారాయణ, యనమల రామకృష్ణుడు, అచ్చెంనాయుడు డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. రాస్తారోకోతో కార్పోరేషన్‌ ఎదుట మెయిన్‌ రోడ్డు పూర్తిగా ట్రాఫిక్‌ స్థంబించటంతో వెస్ట్‌ డీఎస్సీ సంతోష్‌ కుమార్‌ అధ్వర్యంలో వచ్చిన పోలీసులు కార్మిక నాయకులకు సర్దిచెప్పి రాస్తారోకో విరమింపచేశారు. అనంతరం కార్మికులు కార్పొరేషన్‌ కార్యాలయంను ముట్టడించి కొద్దిసేపు దర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఎపి మున్సిపల్‌ వర్కర్స్,ఎంప్లాయిస్‌ జిల్లా నాయకులు బి ముత్యాలరావు, సుదీర్, యాకోబు, సుమన్, అధిక సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులు తదితరలు పాల్గొన్నారు.
Back to Top