ఓట్లు, సీట్ల కోసమే టీడీపీ, బీజేపీలు

విశాఖ: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడకుండా ఓట్లు, సీట్ల కోసమే టీడీపీ, బీజేపీ నేతలు పనిచేస్తున్నారని వైయస్‌ఆర్‌ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. విశాఖలో నిర్వహించిన చైతన్యపథం కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.  పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని ఇచ్చిన హోదా హామీని ప్రభుత్వాలు అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. నిర్లక్ష్యపు ప్రభుత్వాల వల్ల హోదా కోసం పోరాడే దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రపంచలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రధాని మాటకే విలువ లేకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి హోదా కోసం పోరాడకుండా దగ్గరుండి హోదాను నీరుగార్చారని మండిపడ్డారు. ఇలాంటి నేతలు ఉండడం బాధాకరమన్నారు. ప్రజలంతా హక్కుగా భావించే హోదా, రైల్వేజోన్‌పై కలిసి కట్టుగా పోరాడి సాధించుకుంటామన్నారు. 
Back to Top