విభజన బిల్లును కేంద్రానికి తిప్పి పంపాలి

హైదరాబాద్ :

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 ముసాయిదాను కేంద్ర మంత్రివర్గ పునఃపరిశీలన కోసం వెనక్కి పంపా‌లని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేస్తూ శాసనసభ ఒక తీర్మానం చేయాలని వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ శాసనసభా‌ పక్షం నాయకురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు శాసనసభ నియమావళిలోని 77, 78 నిబంధనల కింద స్పీక‌ర్ మనోహ‌ర్‌కు సోమవారం ఆమె నోటీసు ఇచ్చారు. రాష్ట్రపతిని ఉద్దేశించి అసెంబ్లీ చేయాల్సిన తీర్మానం ప్రతిని కూడా దానితో పాటు పొందుపరిచారు.

‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ‌ బిల్లు-2013 ముసాయిదాను కేంద్ర మంత్రివర్గం పునఃపరిశీలనకు పంపాలని రాష్ట్రపతిని కోరుతూ ఈ శాసనసభ తీర్మానం చేస్తోంది. ఎందుకంటే రాజ్యాంగంలోని 3వ అధికరణ కింద రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు చర్యలు ప్రారంభించడానికి ముందు, ఏడవ షెడ్యూలులో భాగమైన 371డి, 371ఇ అధికరణలను 368వ అధికరణంలో పొందుపరిచిన ప్రక్రియను అనుసరించి తొలగించాల్సిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కేంద్రానికి రాష్ట్రపతి సూచించాలి. లేని పక్షంలో ఒకటవ, నాలుగవ షెడ్యూళ్లలోని అంశాలకు మాత్రమే 368 కింద సవరణలు అవసరం లేదని పేర్కొంటున్న నాలుగవ అధికరణను ఉల్లంఘించినట్టు అవుతుంది’ అని విజయమ్మ పేర్కొన్నారు.

ఇది ప్రాధాన్యతాంశం గనుక తమ తీర్మానంపై 10 రోజుల్లోపే చర్చకు అనుమతించాలని స్పీకర్‌ను శ్రీమతి విజయమ్మ తన నోటీసులో కోరారు.

Back to Top