రాష్ట్ర ప్రయోజనాలు మరోసారి తాకట్టు

కృష్ణా మిగులు జలాల విషయంలో ఏపీకి అన్యాయం
భాగస్వామ్య పార్టీని ప్రశ్నించని చంద్రబాబు

హైదరాబాద్ః కృష్ణా జలాల పంపకం విషయంలో కేంద్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ తో  తెలుగు ప్రజలకు తీరని ద్రోహం చేసిందని, దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నోరు మెదపకపోవడం దారుణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు విభజన చేసి ఒకసారి మోసం చేసిన కేంద్రం, ఇప్పుడు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చి మరోసారి మోసం చేసిందని విమర్శించారు.  మహారాష్ట్ర, కర్నాటక, అప్పటి ఉమ్మడి ఏపీల ఘధ్య ట్రిబ్యునల్ ఏర్పడిన సమయంలో చంద్రబాబు కేంద్రాన్ని గట్టిగా నిలదీయకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. 

ఇద్దరు కేంద్రమంత్రులతో పాటు కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబుకు కృష్ణా జలాల పంపకం విషయం తెలియకుండానే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే నమ్మే పరిస్థితి లేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఇన్నాళ్లు కృష్ణాజలాలు వస్తాయని ఆశలు పెట్టుకున్న ఏపీ ప్రజల ఆశలు అడిఆశలు అయ్యాయన్నారు.  కృష్ణా జలాలకు సంబంధించి కనీసం సుప్రీం కోర్టు ముందు సరైన వాదనలు వినిపించకపోవడం బాధాకరమన్నారు. రెండు రాష్ట్రాల మధ్య గొడవలు సృష్టించి కేంద్రం చోద్యం చూడాలనుకోవడం అన్యాయమన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజల ప్రయోజానాలు కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు.చంద్రబాబు ప్రజల కోసం ముఖ్యమంత్రి అయ్యారో, లేక స్వార్థ రాజకీయాల కోసం ముఖ్యమంత్రి అయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

కృష్ణా జలాలు, ప్రత్యేకహోదా సహా అనేక విషయాల్లో కేంద్రంతో రాజీధోరణి అవలంభిచడంలో మర్మమేంటో చెప్పాలన్నారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ప్రజలే చంద్రబాబుకు తగిన బుద్ది చెబుతారన్నారు. కృష్ణా జలాల పంపకం విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చిన రోజే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని వైఎస్ జగన్ ప్రధానికి లేఖ  రాశారన్నారు. కానీ చంద్రబాబు ఇప్పటివరకు లేఖ రాయకపోవడం బాధాకరమన్నారు. ఇక కల్తీ మద్యం ఘటనపై దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు  రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. ఆదాయం కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని, తాము అధికారంలోకి వచ్చాక తమ అధినేత చెప్పినట్లు మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు. 

Back to Top