పరిటాల రవి మృతి వెనుక చంద్రబాబు

హైదరాబాద్ :

పరిటాల రవీంద్ర ఎదుగుదలను చూసి తట్టుకోలేక చంద్రబాబు నాయుడే హత్య చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. టీడీపీ నాయకులే ఈ విషయం బహిరంగంగా చెబుతున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు సిగ్గులేకుండా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రతి విషయానికీ రాజశేఖరరెడ్డిని, శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిలను విమర్శించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, బి.గుర్నాథరెడ్డితో కలిసి శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.

హత్యా రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య‌ అని, పదవి కోసం ఎన్టీ రామారావునే వెన్నుపోటు పొడిచి హత్య చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. అంతేగాక.. కాపు నాయకుడు వంగవీటి రంగాను అత్యంత దారుణంగా హత్య చేయించారన్నారు. ఎలిమినేటి మాధవరెడ్డి, మల్లెల బాబ్జీ, పింగళి దశరథరామ్, పి.ఇంద్రారెడ్డిలను కూడా చంద్రబాబే హత్య చేయించారనే ఆరోపణలున్నాయన్నారు. ఈ ఆరోపణల నుంచి తప్పించుకోవడానికే చంద్రబాబు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ ఆరోపణలతో చంద్రబాబుకు నిజంగా సంబంధం లేకపోతే సీబీఐ విచారణకు సిద్ధపడాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top