ఈ వ్యవస్థను సమూలంగా మారుస్తా

తుని (తూ.గో.జిల్లా) :

‘ఎక్కడ పది‌ మంది అక్కాచెల్లమ్మలు, అవ్వాతాతలు కన్పించినా వారిని ఆప్యాయంగా పలకరించడం నా విధానం. ఈ రోజు మున్సిపాల్టీలు, వార్డుల్లో తిరుగుతున్నప్పుడు ఎక్కడకెళ్లినా ఎవరిని కలిసినా ఇవాళ్టికీ త‌నకు పింఛన్ రావడం లేదన్నా.. రేషన్ కార్డు లేదన్నా.. ఆరోగ్యశ్రీ కార్డు ‌రాలేదన్నా.. ఇల్లు లేదన్నా అని చెబుతున్నారు. వాళ్లందరికీ ఈ సందర్భంగా ఒక భరోసా ఇస్తున్నా. ఈ వ్యవస్థను సమూలంగా మారుస్తాను. ఎక్కడికక్కడ వార్డులోనో, పంచాయతీలోనో ఒక ఆఫీసు తెరిపిస్తా. ఒక కంప్యూటర్ పెడతా. ఒక రెటీనా మిషన్, ఒక లామినేష‌న్ మిషన్, ఒక స్కాన‌ర్ పెట్టిస్తాను. అర్హులైన వారికి ఏ కార్డు కావాలన్నా 24 గ ంటల్లో ఇచ్చేలా చేస్తాను.‌ అదే ఆఫీస్ నుంచి పింఛ‌న్ అందేలా చేస్తాను. ఇక ముందు ఎవరూ ఎటువంటి కార్డుకైనా, ఎవరి గడపా ఎక్కాల్సిన అవసరం లేకుండా చేస్తాను. ఇందు‌ కోసం సీఎం అయిన వెంటనే ఐదో సంతకం చేస్తాను’ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిదవ రోజు సోమవారం ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉదయం శ్రీ ‌జగన్ రోడ్‌షో నిర్వహించారు. రాత్రి తుని గొల్ల అప్పారావు సెంటర్‌లో జరిగిన ‘వైయస్ఆర్ జనభేరి’‌కి హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు.

 ఆ సంతకాలు రాష్ర్ట చరిత్రనే మారుస్తాయి :

'సీఎంగా ప్రమాణం చేసిన రోజున.. అదే క్షణాన ఐదు సంతకాలు చేస్తాను. ఆ సంతకాలు రాష్ర్ట చరిత్రను మార్చేవిగా ఉంటాయి. దివంగత ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి గర్వించేలా ఆ సంతకాలు ఉంటాయి. మొట్టమొదటి సంతకంతో అక్కాచెల్లెమ్మలకు భరోసా ఇస్తున్నాను. మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలను బడికిపంపించండి. అలా పంపే పిల్లలకు ఒకరికైతే రూ. 500, ఇద్దరికైతే రూ. 1,000 ఆ అక్కాచెల్లెమ్మ అకౌంట్‌లో జమ చేస్తాను. అదే అమ్మ ఒడి పథకం. రెండవ సంతకం ఆ అవ్వాతాతల కోసం పెడతాను. వారికి ఇస్తున్న రూ. 200 పింఛన్‌ను రూ. 700 చేస్తాను. రైతన్నలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ. 3 వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తూ మూడవ సంతకం చేస్తాను. డ్వాక్రా అక్కాచెల్లెళ్లకు కొత్త జీవితాన్ని ప్రసాదించేందుకు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తూ నాలుగవ సంతకం చేస్తాను. ఇది 20 వేల కోట్ల రూపాయలే కాబట్టి కిందా మీద పడి ఏదో విధంగా చేస్తానని మీకు మాట ఇస్తున్నా' అని శ్రీ వైయస్‌ జగన్‌ మాట ఇచ్చారు.

జిల్లాకో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి :
గుండె ఆపరేషన్ కావాలన్నా.. మరే ఆధునిక వైద్యం కావాలన్నా ఇప్పటి వరకు హైదరాబా‌ద్ వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ మహానగరాన్ని మనకు కాకుండా చేశారు. మన రాష్ర్టంలో ఎక్కడకు వెళ్లినా వైద్యుల్లేని పరిస్థితిని మారుస్తా. ప్రతీ జిల్లాలో ఒక సూప‌ర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తాను. హైదరాబాద్ నగరానికి మించిన మహానగరాన్ని నిర్మించుకుందాం. అక్కడ 15 నుంచి 17 సూప‌ర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తాను. అక్కడ అన్ని రకాల వైద్యులు అందుబాటులో ఉండేలా చూస్తా. అంతే కాకుండా ఏ జిల్లాలో ఎవరికి ఏ ఆపరేషన్ చేయాల్సి వచ్చినా వైద్యులు అందుబాటులో ఉండేలా రొటేష‌న్ పద్ధతి తీసుకొస్తా‌'నని చెప్పారు.

తలరాతలు మారాలి :
వరుసగా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత మన భవిష్యత్‌ను నిర్ణయించే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు జరుగుతాయి. మనం వేసే ఓటు మన తలరాతలను మార్చేదిగా ఉండాలి. సీఎం స్థానంలో కూర్చునే వ్యక్తి ప్రజల మనసు ఎరిగేవాడు.. ప్రజల గుండెచప్పుడు వినేవాడు.. చని పోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో బతికి ఉండేలా పాలించేవాడిని ఎన్నుకోవాలి. దివంగత నాయకుడు రాజశేఖరరెడ్డి మన మధ్య నుంచి దూరమై ఐదేళ్లయినా ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తే.. మా గుండెల్లో బతికే ఉన్నారని సమాధానం వస్తోంది. అలాంటి నాయకుడినే ఎన్నుకోవాల'న్నారు.

9 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశావ్?
'చంద్రబాబు భయానక పాలన ఇంకా గుర్తుంది. పంటలు వరుసగా దెబ్బతిని రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న రోజులవి. వారి కోసం మహానేత వైయస్‌ఆర్ ఎన్నో  ఉద్యమాలు చేశారు. ఉచిత కరెంట్ ఇవ్వాలని, రుణాలు మాఫీ చేయమని ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. అయినా బాబు మనసు చలించలేదు. పైగా హేళనగా మాట్లాడేవారు. అ‌లాంటి బాబు ఇప్పుడు అధికారం కోసం రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని అబద్ధాలు ఆడుతున్నారు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉండగా ఎందుకు రైతుల రుణాలు మాఫీ చేయలేకపోయారని అడుగుతున్నా. ఏకంగా మూడున్నర కోట్ల ఉద్యోగాలిస్తానని చంద్రబాబు చెబుతుండడం ప్రజలను వంచించడం కాదా?' అని శ్రీ జగన్‌ నిప్పులు చెరిగారు.

కుప్పం- శ్రీకాకుళం కారిడార్‌తో ఉద్యోగాలు :
‘అధికారంలోకి వచ్చాక కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పారిశ్రామిక కారిడార్ నిర్మించుకోవాలి. భారీ పరిశ్రమలు తీసుకురావాలి.‌ వ్యవసాయం, ఎలక్ట్రానిక్సు, మాన్యుఫ్యాక్చరింగ్ ఇలా పలు మౌలిక సదుపాయాలు కల్పించే పరిశ్రమలు తీసుకురావాలి. వాటిని తెచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తా. ఉద్యోగం కోసం హైదరాబాద్‌వైపు చూడకుండా ఇక్కడే వాటిని కల్పిస్తాను. మరో పదేళ్లలో సింగపూర్‌కు మించిన రాయల్‌సిటీని నిర్మించుకుందాం. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం వచ్చేలా పనిచేస్తా' అని శ్రీ జగన్‌ తెలిపారు.

Back to Top