రెండు నెలల్లో సమస్యలన్నీ తీరతాయి

తణుకు (పశ్చిమ గోదావరి జిల్లా) :

‘కొద్దిరోజులు ఓపిక పట్టండమ్మా.. రెండు నెలల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది.. అందరికీ మంచి జరుగుతుంది.. మీ సమస్యలన్నీ తీరిపోతాయి’ అంటూ వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తనను కలిసి తమ బాధలు చెప్పుకొన్న వృద్ధులు, మహిళలకు ధైర్యం చెప్పారు. వరుసగా మూడవ రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన శ్రీ జగన్ ఆదివారం తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో విస్తృతంగా రో‌డ్‌షో నిర్వహించారు.

తణుకు పట్టణ శివారులో ఉన్న పైడిపర్రులో ఉదయం 10 గంటలకు మొదలైన శ్రీ జగన్ రో‌డ్‌షో రాత్రి 10 గంటల వరకూ నిరంతరాయంగా కొనసాగింది. అడుగడుగునా జనం ‘అడుగో జగన్’ అంటూ ఆయనను చూసి కేరింతలు కొట్టారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులు శ్రీ జగన్‌ను చూసేందుకు ఎగబడ్డారు.

వైయస్ఆర్ పెట్టిన పథక‌మే బ్రతుకునిచ్చింది :

ఎండలు మండిపోతున్నా లెక్క చేయకుండా అభిమానజనం గంటల తరబడి రోడ్లపై శ్రీ జగన్ కోసం నిలబడి ‌ఎదురుచూశారు. తణుకులో వృద్ధురాలు రంగమ్మ తన ఇంటి మెట్ల నుంచి కిందకు దిగడానికి యత్నిస్తుండగా.. శ్రీ జగన్మోహన్‌రెడ్డి వెంటనే కారు దిగి ఆమె వద్దకు వెళ్లి కుశల ప్రశ్నలు వేశారు. ‘మీ నాన్నగారు చాలా మంచి పనులు చేశారయ్యా.. నువ్వు కూడా ముఖ్యమంత్రి అయ్యి అవన్నీ చేయాలి.. నూరేళ్లు చల్లగా ఉండు బాబూ..’ అని ఆ వృద్ధురాలు ఆప్యాయంగా శ్రీ జగన్‌ను ఆశీర్వదించింది. ‘జాగ్రత్తమ్మా.. అంతా మంచి జరుగుతుంది’ అంటూ శ్రీ జగన్ ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు.

‌తణుకు రైల్వే స్టేషన్ రోడ్డులో ఒక ఆస్పత్రిలో నుంచి బయటకు వచ్చిన వృద్ధురాలు దుర్గ తన మనుమరా‌లితో కలిసి బయటకు వచ్చి‌ శ్రీ జగన్ కోసం రోడ్డు పక్కన నిలబడింది. ఆయన రాగానే రెండు చేతులు పట్టుకుని ‘బాబూ మీ నాన్నగారు పెట్టిన పథకం వల్లే ‌నాకు గుండె ఆపరేష‌న్ జరిగింది. రేపు ఆపరేషన్ చేస్తున్నారు. మీ వల్లే బతుకున్నానంటూ’ కంట తడి పెట్టింది. ‌ఆ వృద్ధురాలి మాటలతో చలించిపోయిన‌ శ్రీ జగన్.. అందరికీ మంచి జరుగుతుందమ్మా అంటూ వారికి ధైర్యం చెప్పారు.

పిల్లల్ని బడికి పంపే తల్లి ఖాతాలో డబ్బులేస్తాం :
తణుకు పాతూరులో స్థానికులు చాలా ఏళ్ల నుంచి తమకు ఇళ్లు లేవని, అద్దె ఇళ్లల్లో ఉంటున్నామని వాపోయారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి వారికి ధైర్యం చెబుతూ ‘రెండు నెలలు ఓపిక పట్టండి.. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు అందరికీ మంచి చేస్తా. మీ అందరికీ అండగా ఉంటా’ అని హామీ ఇచ్చారు. పలుచోట్ల విద్యార్థులు శ్రీ జగన్‌తో చేయి కలిపేందుకు పోటీపడ్డారు. అందరినీ దీవించి వారికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చిన శ్రీ జగన్ ఏ‌మి  చదువుతున్నారు, బాగా చదువుకోండని చెప్పారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్సుమెంట్ పథకంతో ఇంకా బాగా చదువుకోవచ్చని చెప్పారు.

‌సజ్జాపురంలో కొందరు మహిళలు శ్రీ జగన్ వద్దకు వచ్చి చాలీచాలని కూలీలతో బతుకుతున్నామని, కూలీ చాలక తమ పిల్లలతో కూడా పనిచేయించక తప్పడం లేదని ఆవేదన వె‌లిబుచ్చారు. ‘మీరేం అధైర్యపడొద్దు.. మీ పిల్లల్ని నేను చదివిస్తా. మీరు వాళ్లను బడికి పంపిస్తే చాలు.. ఒక్కొక్కరికి రూ.500 చొప్పున కుటుంబానికి ఇద్దరికి వెయ్యి రూపాయిలు మీ బ్యాంక్‌ ఖాతాలో వేస్తా’ అని శ్రీ జగన్ ‌చెప్పడంతో వారు ఆనందంతో పొంగిపోయారు. తర్వాత కొందరు ముఠా కార్మికులతో శ్రీ జగన్ మాట కలిపారు.‌ రోజుకు ఎంత కూలి వస్తుందన్నా అని వారిని అడగ్గా వారు రూ.200 వస్తుందని, సంపాదించిందంతా ఇంటి అద్దె కట్టడానికే సరిపోతుందని ఆవేదనగా చెప్పారు. త్వరలో మీ కష్టాలు తీరతాయి.. రెండు నెలలు ఓపిక పట్టండి అని చెప్పి ఆయన అక్కడి నుంచి ముందుకుసాగారు.

ఇరగవరం కాలనీలో రెండు కాళ్లూ కోల్పోయిన వికలాంగురాలు కొడమంచిలి పాపాయమ్మ మూడు చక్రాల బండిపై ఉండి శ్రీ జగన్మోహన్‌రెడ్డితో కరచాలనానికి దగ్గరకొచ్చే ప్రయత్నం చేస్తుండగా ఆయనే కారు దిగి ఆమె వద్దకెళ్లి మోకాళ్లపై నిలబడి మాట్లాడారు. ‘ఏమ్మా ఎలా ఉన్నావు. నీ పేరేమిటి. పెన్షన్ వస్తు‌న్నదా’ అని కుశల ప్రశ్నలు అడిగారు.

కిక్కిరిసిన రహదారులు:
తాడేపల్లిగూడెం మసీదుపేటలో ముస్లిం మహిళలు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని చూసి ఆనంద భాష్పాలతో ‘మమ్మల్ని గుర్తించి ఇక్కడి నుంచి మీ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చారయ్యా. మా సంక్షేమం గురించి ఆలోచించు బాబూ’ అని కోరారు. తమ సాంప్రదాయం ప్రకారం శాలువా కప్పి టోపీ బహూకరించారు. ముస్లింలకు న్యాయం చేస్తానని శ్రీ జగన్ వారికి మాటిచ్చారు. తాడేపల్లిగూడెం పాతూరు సాయంత్రం నుంచి జనంతో నిండిపోయింది. ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఆయనకు స్వాగతం పలికారు. ప్రతిచోటా ఆగిన‌ శ్రీ జగన్ అందరినీ పల‌కరించి వారి పేర్లు తెలుసుకుంటూ, సమస్యలు వింటూ, ధైర్యం చెబుతూ ముందుకెళ్లారు.

గొంతు సమస్య... ప్రసంగాలకు విరామం :
శ్రీ జగన్మోహన్‌రెడ్డికి గొంతు సమస్య ఏర్పడడంతో పరీక్షించిన వైద్యులు రెండు రోజులు ప్రసంగించవద్దని సూచించారు. దీంతో శని, ఆదివారాల్లో ఆయన ఎక్కడా ప్రసంగించలేదు. మైకు ప్రసంగాలు చేయకపోయినా ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూనే ఉన్నారు.

‌రోడ్‌షోలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి వెంట వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ జిల్లా కన్వీన‌ర్ తెల్లం బాలరాజు, నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త ముదునూరి ప్రసాదరాజు, తణుకు, తాడేపల్లిగూడెం సమన్వయకర్తలు చీర్ల రాధయ్య, తోట గోపి, మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, పాతపాటి సర్రాజు తదితరులున్నారు.

Back to Top