బీజేపీ- టీడీపీ హామీలన్నీ బూటకాలు

కైకలూరు (కృష్ణాజిల్లా) :

రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ బీజేపీ- టీడీపీ ఇస్తున్న హామీలు వట్టి బూటకాలు అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తూర్పారపట్టారు. 1999- 2004 మధ్య ఉన్న ఇదే కూటమి రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. అవకాశవాద రాజకీయాలు చేస్తున్న ఆ పార్టీలు తెలంగాణలో కుందేలు మాదిరిగా ఎన్నికల రేసులో వెనకబడిపోయి, సీమాంధ్రలో మాత్రం వేటకుక్కల్లా వెంపర్లాడుతున్నాయని ఆరోపించారు. కృష్ణా జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ జగన్ గురువారం పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో రో‌డ్‌షో నిర్వహించారు. బంటుమిల్లి నుంచి మొదలైన వైయస్ఆర్ జనభేరి సింగరాయపాలెం మీదుగా కైకలూరు అక్కడి నుంచి విజయవాడ వరకు ‌కొనసాగింది. దారిపొడవునా శ్రీ జగన్ వృద్ధులు, యువకు‌లు, మహిళలను పలకరిస్తూ ముందుకు సాగారు. బంటుమిల్లి, కైకలూరులలో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రసంగించారు.

బీజేపీ నాయకులు, చంద్రబాబు ఒక్కటై రాష్ట్ర విభజనకు పూర్తిగా మద్దతిచ్చి.. ఇప్పుడు స్వర్గాన్ని తెచ్చి సీమాంధ్రను అద్భుతంగా అభివృద్ధి చేస్తామంటూ అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని శ్రీ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. మొన్నటి వరకు తెలంగాణలో తిరుగుతూ తమ వల్లే రాష్ట్ర విభజన జరిగిందంటూ చెప్పుకొన్న నరేంద్ర మోడీ, చంద్రబాబు.. అక్కడ ఎన్నికలైపోయిన రాత్రికి రాత్రే మాట మార్చి విభజనకు కారణం జగనే అంటున్నారని, చెడిపోయిన ఈ రాజకీయాలు చూస్తుంటే చాలా బాధనిపిస్తోందని శ్రీ జగన్ ఆవేదన వ్యక్తంచేశారు.

‘తిరుపతి సభలో నరేంద్ర మోడీ గ్యా‌స్ గురించి మాట్లాడారు. మన రాష్ట్రంలో ఉన్న గ్యా‌స్‌తో దేశాన్ని అభివృద్ధి చేస్తానని మోడీ చెప్తున్నారు. మా రాష్ట్రంలో ఉన్న గ్యాస్‌లో.. కనీసం మన రాష్ట్రానికి ఎంత గ్యాస్ కోటా ఇస్తారని మోడీని అడుగుతున్నా. ఆ మాట మాట్లాడరు. కానీ మన వనరులతో దేశాన్ని బాగు‌చేస్తామంటున్నారు. ఇలాంటి దొంగ ప్రేమ చూపిస్తున్నారు’ అని శ్రీ జగన్ ‌విమర్శించారు.

తెలంగాణలో ఎన్నికలవగానే వారి మాట మారింది :
‘వైయస్ రాజశేఖరరెడ్డి మన మధ్య నుంచి వెళ్లిపోయాక రాజకీయాలు చెడిపోయాయి. ఓట్లు, సీట్ల కోసం ఎన్ని అబద్ధాలు ఆడడానికైనా వెనుకాడడంలేదు. బంగారం లాంటి‌ మన రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చడానికి కూడా వెనుకాడడం లేదు. రాష్ట్రాన్ని సోనియాగాంధీ అడ్డగోలుగా విడగొట్టారు. రాష్ట్రాన్ని విడగొట్టడం అన్యాయమని చంద్రబాబు, బీజేపీ చెబుతూనే.. మరోవైపు వీళ్లే పార్లమెంటులో వీళ్ల ఎంపీల చేత విభజనకు అనుకూలంగా ఓట్లు వేయించారు. బీజేపీ నాయకులు తెలంగాణకు వెళ్లి.. ‘పెద్దమ్మ సోనియా గాంధీ ఒకరే కాదు.. చిన్నమ్మను నన్ను కూడా గుర్తుపెట్టుకోండి.. నేను మద్దతు ఇవ్వకపోతే రాష్ట్ర విభజన జరిగేది కాదు’ అన్నారు. ‘మేమిచ్చిన ఆ లేఖతోనే రాష్ట్ర విభజన జరిగింది.. లేకుంటే విభజన జరిగేది కాదు’ అని తెలంగాణలో తిరిగినప్పుడు చంద్రబాబు అన్నారు. అక్కడ ఎన్నికలు అయిపోయి గంట కూడా గడవక ముందే మోడీ, చంద్రబాబు రాత్రి ఏడింటి కల్లా తిరుపతిలో మీటింగ్ పెట్టారు. రాష్ట్రాన్ని విభజించింది వై‌యస్‌ఆర్‌సీపీ అని నిస్సిగ్గుగా మాట్లాడారు' అని శ్రీ జగన్‌ నిప్పులు చెరిగారు.

నాలుగేళ్లుగా కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు :
'అవినీతి గురించి వారు తిరుపతిలో మాట్లాడారు. కేసుల గురించి చెప్పారు. వీళ్లందరినీ నేను ఒకటే అడుగుతున్నా. వైయస్ బతికున్నంత వరకు ఆయ‌నను మించిన ముఖ్యమంత్రి ఎవరూ లేరన్నారు. వైయస్ చనిపోయి 18 నెలలు అయ్యాక జగ‌న్ అనే వ్యక్తి కాంగ్రె‌స్ నుంచి విడిపోయిన రెండు నెలల తర్వాత.. ఇదే కాంగ్రె‌స్ పార్టీ వాళ్లతో ఇదే చంద్రబాబు కుమ్మక్కై కోర్టుల దాకా వెళ్లి కేసులు వేసింది వాస్తవం కాదా? చంద్రబాబు, కాంగ్రె‌స్ నాలుగేళ్లుగా కుమ్మక్కయ్యారు. సీబీఐ జగ‌న్ మీద విచారణ చేస్తోంది. ఎమ్మార్, ఐఎంజీ కేసుల్లో చంద్రబాబును మాత్రం కనీసం పిలువలేదు. చంద్రబాబుకు ఒక న్యాయం... జగ‌న్‌కు మరో న్యాయం' అని విమర్శించారు.

ఆ రాష్ట్రాలకు చేసిందేమిటి ?:
'బీజేపీని నేను ఒకటి అడగదలచుకున్నా.. 1999-2000 సంవత్సరంలో మీరు చిన్న రాష్ట్రాలకు అనుకూలమని జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లను ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో రాయపూర్‌ను, జార్ఖండ్‌లో రాంచీని మహానగరాలుగా తీర్చిదిద్దాలని అనుకున్నారు. ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్‌ను కూడా మహానగరంగా చేయాలనుకున్నారు. ఇప్పుడు అడుగుతున్నా.. ఆ మూడు రాష్ట్రాలకు వెళ్లి చూసి రండి. ఆ మూడు రాష్ట్రాల్లో కనీసం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా లేదు. ఎయిమ్సు తరహా, నిమ్సు తరహా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా లేదన్న సంగతి వీళ్లకి తెలుసా? 1999లో ఈ రాష్ట్రాలను వేరు చేసినప్పుడు ఇదే ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ నగరానికి రూ. 10 వేల కోట్లు ఇస్తామన్నారు. కొత్త రాజధానిని, కొత్త మహానగరాన్ని నిర్మించుకోవడానికి ఇస్తామన్నారు. విడదీశాక బీజేపీ నాలుగేళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కూడా వీరు ఇచ్చిన డబ్బు ఎంతో తెలుసా... ముష్టి‌ వేసినట్లు రూ. 400 కోట్లు మాత్రమే. ఇప్పుడు మాత్రం చిన్న రాష్ట్రాలు గొప్పగా ఉంటాయని, అది చేస్తాం.. ఇది చేస్తామని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు’ అని తూర్పారపట్టారు.

తొలి అసెంబ్లీ భేటీల్లోనే కొల్లేరుపై బిల్లు :
‘2008లో వైయస్‌ఆర్ ఇంతకు‌ ముందు ఎవరూ చేయని సాహసం చేశారు. అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు. కొల్లేరును కాంటూరు +5 నుంచి కాంటూరు +3కు తగ్గిస్తూ తీర్మానం చేసి పంపారు. కానీ ఆ తర్వాత ఆయన చనిపోయారు. నేను ఇప్పుడు హామీ ఇస్తున్నా నా మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఇది పెడతాను. కొల్లేరు కాంటూరును మరోసారి +5 నుంచి +3 కి తగ్గిస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపిస్తా. మనకు 25 ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో మనమే ప్రధానిని నిర్ణయిస్తే ఈ సమస్యను రెండేళ్లలో పరిష్కరిస్తా. పార్టీ నాయకుడు దూలం నాగేశ్వరరావుకు నా గుండెల్లో స్థానం ఉంది. ఈ జిల్లా నుంచి మొదటి ఎమ్మెల్సీగా ఆయన్ను తీసుకెళ్తాను’‌ అన్నారు.

ఆ ఐదేళ్లలో టీడీపీ-బీజేపీ చేయలేదేం? :

'బీజేపీ-చంద్రబాబు కలిస్తే స్వర్గాన్ని కిందకు తీసుకొస్తామని కూడా తీరుపతి సభలో ఆ పెద్దమనుషులు చెప్పారు. నేను చంద్రబాబును, బీజేపీని అడగదలచుకున్నా. 1999 నుంచి 2004 వరకు టీడీపీ-బీజేపీ ఇద్దరు కలిసి ఒక్కటై దేశంలో చక్రం తిప్పారు. ఆ ఐదేళ్లలో మీరు ఈ రాష్ట్రానికి చేసిన ఒక్కటంటే ఒక్క మేలు ఏంటో చెప్పగలరా? రాష్ట్రం అంతా వెయ్యి కిలోమీటర్ల తీరం ఉందని, చంద్రబాబుకు ఓటెయ్యాలని, ఆయన గొప్పగా బాగుచేస్తారని మోడీ చెబుతున్నారు. 1999 నుంచి 2004 వరకు మీరు కలిసి ఉన్నపుడు మీకు ఈ వెయ్యి కిలోమీటర్ల తీరం కనిపించలేదా? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు గాని,  గాలేరు-నగరి లాంటి రాయలసీమ ప్రాజెక్టులు గాని పూర్తి చేయాలని ఆ ఐదేళ్లలో మీకెందుకు అనిపించలేద'ని శ్రీ వైయస్‌ జగన్‌ సూటిగా ప్రశ్నించారు.

Back to Top