జైలులోనే జగన్ నిరవధిక నిరాహార దీక్ష

‌హైదరాబాద్, 25 ఆగస్టు 2013:

నిరంకుశ ధోరణితో, ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజించడానికి కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదివారం ఉదయం నుంచే నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. కాంగ్రెస్, టిడిపిల కుట్ర రాజకీయాల కారణంగా చంచల్‌గూడ జైలులో విచారణ ఖైదీగా ఉన్న శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఈ ఉదయం టీ, అల్పాహారం ముట్టుకోకుండా దీక్షకు ఉపక్రమించారు.

కాగా, శ్రీ జగన్మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో చంచల్గూడ జైలు వద్ద భారీ‌గా బందోబస్తు ఏర్పాటు చేశారు. వైయస్ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో‌ జైలు వద్దకు వచ్చే అవకాశం ఉన్నందున వారిని నియంత్రించేందుకు ఈ బందోబస్తు ఏర్పాటైంది. ఇరు ప్రాంతాలకూ సమన్యాయం చేయాలని, అలా చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో శ్రీ జగన్ జైలులోనే‌ నిరశన దీక్ష ప్రారంభించారు.

కాగా, శ్రీ జగన్మోహన్‌రెడ్డి మాతృమూర్తి, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ఇదే డిమాండ్‌తో గుంటూరులో ఆరు రోజులు (సుమారు 100 గంటలు) చేసిన దీక్షను శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు అడ్డగోలుగా భగ్నం చేశారు. గుంటూరు ఆస్పత్రిలో కూడా నిరవధిక దీక్షను శ్రీమతి విజయమ్మ కొనసాగించారు. ఆరు పదుల వయస్సుకు చేరువలో ఉన్న శ్రీమతి విజయమ్మ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీక్ష విరమించాలని శ్రీ జగన్మోహన్‌రెడ్డి దీక్ష విరమించాలని కోరారు. ప్రజల కోసం ఇప్పుడు శ్రీ జగన్‌ తానే స్వయంగా నిరవధిక దీక్ష ప్రారంభించారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించడంతో ఆయనకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వైయస్ అభిమానులు, పార్టీ శ్రేణులు, నాయకులు కూడా నిరాహార దీక్షలు ప్రారంభించారు.

తాజా వీడియోలు

Back to Top