నిమ్సులో కోలుకుంటున్న జగన్మోహన్‌రెడ్డి

హైదరాబాద్, 4 సెప్టెంబర్ 2103:

వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. ఆయన శరీరంలో కీటోన్సు సాధారణ స్థితికి చేరినట్టు నిమ్సు వైద్యులు ధ్రువీకరించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆరోగ్యానికి సంబంధించిన నివేదికను చంచల్‌గూడ జైలు అధికారులకు నిమ్సు వైద్యులు అందజేసినట్టు తెలుస్తోంది. సమన్యాయం చేయకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్‌ చేస్తూ శ్రీ జగన్మోహన్‌రెడ్డి చంచల్‌గూడ జైలులోనే నిరవధిక నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పాటు కఠోర దీక్ష చేసిన ఆయన ఆరోగ్యం క్షీణించడంతో గడచిన శుక్రవారం రాత్రి శ్రీ జగన్‌ను నిమ్సుకు తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడితే వైద్యులు, జైలు అధికారుల నిర్ణయం అనంతరం ఆయనను మళ్లీ చంచల్గూడకు తరలించే అవకాశం ‌ఉంది.

వారం రోజుల దీక్ష అనంతరం శ్రీ జగన్‌ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో నిమ్సు ఆసుపత్రి వైద్యులు శనివారం ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్సు (గ్లూకోజ్) ఎక్కించారు. ఆగస్టు 25వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నిరవధిక నిరాహార దీక్ష మొదలుపెడుతున్నట్లు పార్టీ నాయకులతో చెప్పిన‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నిజానికి అంతకు ముందు రోజు సాయంత్రం 6 గంటల నుంచీ ఆహారం ముట్టలేదు. దీంతో, శనివారం మధ్యాహ్నం దీక్ష భగ్నమయ్యే వరకు మొత్తం 163.30 గంటలపాటు శ్రీ జగన్మోహన్‌రెడ్డి నిరాహార దీక్ష చేసినట్లయింది.

24వ తేదీ నుంచే శ్రీ జగన్మోహన్‌రెడ్డి మెతుకు ముట్టకపోవడం, ఆరోగ్యం క్షీణించడంతో 29వ తేదీ అర్ధరాత్రి ఆయనను కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం, అక్కడ కూడా ఆయన దీక్ష విరమించకపోవడం, ఉస్మానియాలో తగిన వైద్య సదుపాయాలు అందుబాటులో లేని నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఆయనను నిమ్సు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు సెలైన్ ఎక్కించి, దీక్షను భగ్నం చేశారు. బుధవారం నాటికి ఆయన ఆరోగ్యం కొద్దిగా కుదుటపడినట్లు ని‌మ్సు వర్గాల ద్వారా తెలిసింది.

Back to Top