పార్లమెంటు వీధిలో జగన్ ర్యాలీ.. అరె‌స్టు

న్యూఢిల్లీ:

రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ.. విభజనపై కేంద్రం అనుసరిస్తున్న తీరును తీవ్రంగా  నిరసిస్తూ వైయస్ఆర్‌ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో‌ని జంతర్‌మంతర్‌ నుంచి పార్లమెంటుకు ఆకస్మికంగా తలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీని ముందుండి నడిపించిన పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సహా ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేశారు. జంతర్‌మంతర్ వద్ద జరిగిన సమైక్య ధర్నాలో చివ‌రిగా మాట్లాడిన శ్రీ జగన్ ప్రసంగం చివ‌రిలో కేంద్రం తీరును ఎండగడుతూ పార్లమెంటుకు ర్యాలీగా వెళదాం అని ప్రకటించారు. వెంటనే స్టేజీ దిగి పార్లమెంటు వైపుగా నడక ప్రారంభించారు. ధర్నాలో పాల్గొన్న సుమారు ఐదు వేల మంది సమైక్యవాదులు ఒక్కసారిగా ‘జై జగన్’, ‘జై సమైక్యాంధ్ర’ నినాదాలు చేస్తూ, పార్టీ జెండాలు చేతపట్టుకొని ఉత్సాహంగా ముందుకు కదిలారు.‌ శ్రీ వైయస్ జగ‌న్ ముందుకు ‌వెళుతుండగా సమైక్యవాదులు పార్లమెంటు వైపుగా దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ‘ఇటలీ సోనియా డౌన్‌డౌన్’, 'వియ్ వాంట్ జస్టిస్’ నినాదాలతో హోరెత్తించారు.

ర్యాలీ పార్లమెంట్ స్ట్రీ‌ట్ పోలీ‌స్ స్టేష‌న్ ముందుకు వెళ్లిన అనంతరం వందలాదిగా మోహరించిన పోలీసులు బారికేడ్లను అడ్డుగా వేసి ర్యాలీని ముందుకు పోనిచ్చేది లేదని తెగేసి చెప్పటంతో శ్రీ జగన్ అక్కడే బైఠాయించారు. ఎంపీ మేకపాటి రాజమోహ‌న్‌రెడ్డి, మాజీ ఎంపీలు ఎంవీ మైసూరారెడ్డి, బాలశౌరి, ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, బాలినేని, ఆదినారాయణరెడ్డి తదితరులు కూడా బైఠాయించారు. ఆందోళన విరమించాలని, అక్కడి నుంచి లేవాలని పోలీసులు కోరినా శ్రీ జగన్ తిరస్కరించారు.

ఈ సమయంలో కొందరు బారికేడ్లను దాటే‌ ప్రయత్నం చేశారు. దీంతో తోపులాట జరిగింది. అరగంట అనంతరం శ్రీ జగన్ సహా అక్కడ బైఠాయించిన నేతలందరినీ పోలీసులు అరె‌స్టు చేసి స్టేషన్ లోనికి తీసుకెళ్లారు. దీంతో పార్టీ నేతలు, సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బారికేడ్లను దాటి పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, నేతల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ సమయంలో పార్టీ నేతలు పుత్తా ప్రతాప్‌రెడ్డి, తమ్మినేని సీతారాం, చల్లా మధుసూదన్‌రెడ్డి కల్పించుకొని సమైక్యవాదులకు నచ్చజెప్పారు. దీంతో వారంతా శ్రీ జగన్ అరె‌స్టుకు నిరసనగా అక్కడే బైఠాయించి నిరసన కొనసాగించారు. సుమారు గంట అనంతరం వేరే దారిలో శ్రీ వైయస్ జగ‌న్ సహా అరె‌స్టు చేసిన నేతలందరినీ విడుదల చేసి పంపించడంతో వారంతా శాంతించారు.

Back to Top