మన తలరాత మార్చే ఎన్నికలివి

చల్లపల్లి/ పామర్రు/ ఉయ్యూరు (కృష్ణా జిల్లా):

మన తలరాతను మార్చబోయే ఈ ఎన్నికల్లో ఓటు వేసే ముందు మనలను మనం ప్రశ్నించుకోవాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎలాంటి నాయకుడు మనకు కావాలో.. ఎటువంటి ముఖ్యమంత్రి కావాలో మనం ప్రశ్నించుకోవాలన్నారు. ఏ ముఖ్యమంత్రి ప్రతి పేదవాడి గుండెచప్పుడు వింటాడో, వాళ్ల మనస్సు తెలుసుకుంటాడో.. ఏ నాయకుడు చనిపోయిన తరువాత కూడా పేదవాళ్ళ గుండెల్లో ఉండాలని ఆరాటపడతాడో.. అలాంటి వ్యక్తిని మనం నాయకుడిగా ఎన్నుకోవాలని సూచించారు. అలాంటి వ్యక్తినే మనం సీఎంగా ఎన్నుకోవాలన్నారు. అప్పుడే మన తలరాతలు మంచిగా మారతాయని శ్రీ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లాలో శ్రీ జగన్‌ బుధవారం ముందుగా ఉదయం చల్లపల్లిలో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం వైయస్ఆర్ జనభేరి సభలో మాట్లాడారు. సాయంత్రం పామర్రులో, రాత్రి‌కి ఉయ్యూరులో జరిగిన బహింగ సభలలోనూ ఆయన ప్రసంగించారు.

‘ఈ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు వేసే ఓటుతో మన తలరాతను మార్చుకోబోతున్నాం. మహానేత డాక్టర్ వైయస్‌ ‌రాజశేఖరరెడ్డి మాత్రం ఇప్పటికీ ప్రతి పేదవారి గుండెల్లో ఉండిపోయారు. రాజకీయాలు, కులాలు,  మతాలు, పార్టీలకు అతీతంగా ప్రతీ పేదవాడికీ మంచి చేసిన మహానుభావుడు వైయస్ఆర్‌. వైయస్ఆర్ పరిపాలనకు ముందు.. ఇప్పుడు జరుగుతున్న పాలనను ఒకసారి బేరీజు వేసుకోవాలి’ అని శ్రీ వైయస్‌ జగన్ సూచించారు.

బాబు‌ వస్తే... నిలదీయండి :
తొమ్మిదేళ్లు సీఎంగా వెలగబెట్టిన చంద్రబాబూ... ఇవాళ అన్నీ ఫ్రీగా ఇస్తానని చెప్తున్నావు... మరి తొమ్మిదేళ్ళలో ఒక్కటంటే ఒక్కటీ ఎందుకు చేయలేకపోయావు? అని గట్టిగా నిలదీయండి. ఎందుకయ్యా ఇలా అబద్ధాలు చెబుతావు? అని ప్రశ్నించండి. ఎప్పుడైనా కాలేజీలకు వె ళ్లావా? వారెలా చదువుతున్నారో తెలుసుకున్నావా? అని అడగండి. తొమ్మిదేళ్లు సీఎంగా ఉంటూ పేదోడి పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకున్నావా? ఇంజనీరింగ్ చద‌వడానికయ్యే ఖర్చు రూ. 30 వేలు కట్టాలంటే పొలమో ఇల్లో అమ్ముకుంటే తప్ప చదివించలేని పరిస్థితి. ఈ పరిస్థితిని నీవు ఎప్పుడైనా తెలుసుకున్నావా చంద్రబాబూ? అంటూ ప్రశ్నించండి' అని శ్రీ జగన్‌ ప్రజలకు సూచించారు.

'ఎన్నికలకు వెళ్లే ముందు రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తానని చెప్పావు... ఎన్నికలు అయిపోయాక రెండు రూపాయల బియ్యాన్ని ఐదుంపావలా చేయలేదా చంద్రబాబునాయుడూ? అని ప్రశ్నించండి. ఏ రోజైనా ఆయన గ్రామాల్లోకి వెళ్లాడా అని అడగండి. ఎన్నికల ముందు మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పా వు. ఎన్నికలు అయిపోయాక మద్యపానం నిషేధిస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని ‘ఈనాడు’ దినపత్రికలో పెద్దపెద్ద అక్షరాలతో రాయించావు. అలా రాయించిన మూడు రోజుల్లోనే ప్రతి గ్రామంలో బెల్టుషాపులు తెచ్చింది నీవు కాదా? అని చంద్రబాబును నిలదీయండి' అని అన్నారు.

విశ్వసనీయత లేని రాజకీయాలు చేయలేను :

'చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతున్నాడు. విశ్వసనీయత లేని మాటలు మాట్లాడుతున్నాడు. నిజాయితీ లేని తన మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్నీ ఫ్రీగా ఇస్తానంటున్నాడు. ఒక రోజు సెల్‌ఫోన్లు ఫ్రీగా ఇస్తానని చెప్తాడు. రెండో రోజు టీవీలు ఫ్రీగా ఇస్తానంటాడు. మూడో రోజు సాధ్యంకాని రూ. 1.27 లక్షల కోట్ల రైతు రుణాలు మాఫీ అంటాడు. మరో రోజు మీరెవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దు.. మీ ఇంటికే అన్నీ ఫ్రీగా ఇస్తానని చంద్రబాబునాయుడు చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు సాధ్యం కానివి, చేయలేనివి చెప్తూ అబద్ధాలు మాట్లాడుతూ రాజకీయాలు చేస్తున్నాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని అంటున్నాడు. ఒక్కటైతే నేను చెప్తా.. చంద్రబాబులా నేను అబద్ధాలు ఆడలేను. ఆయనలా విశ్వసనీయత లేని రాజకీయాలు చేయలేను. నేను ఒక మాట చెప్తే ఆ మాట కోసం నిలబడతాను' అన్నారు.

వైయస్ఆర్ నుంచి వారసత్వం‌గా విశ్వసనీయతే వచ్చింది :
'చంద్రబాబు ఎందుకు విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తున్నాడంటే.. ఆయనకు 65 ఏళ్లు. ఈ ఎన్నికలు అయిపోయాక ఆయనుండడు.. ఆయన పార్టీ ఉండదు.. ఆ విషయం చంద్రబాబుకు తెలుసు. అందుకే అడ్డగోలుగా అధికారం కోసం ఏ గడ్డైనా తినడానికి వెనకాడటం లేదు. ఆయనలా నేను విశ్వసనీయతలేని, నిజాయితీ లేని రాజకీయాలు చేయలేను. చంద్రబాబు నాయుడు కంటే పాతిక సంవత్సరాల చిన్నోడిని. మరో ముప్పై ఏళ్ళు రాజకీయంలో ఉండాలి. విశ్వసనీయత మీదే రాజకీయాలు చేయాలి కాబట్టి అబద్ధాలు చెప్పలేను. దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి నుంచి నాకు వచ్చింది విశ్వసనీయత. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున అదే వేదికపైన ఐదు సంతకాలు పెట్టబోతున్నాను. దీంతో పాటు అదనంగా ఆరు పనులు చేపట్టబోతున్నాను. ఈ పదకొండు పనులతో ఈ రాష్ట్ర దశ, దిశ మార్చుతాను. ఆ దేవుడు అనుగ్రహిస్తాడు.. చెప్పినవే కాదు చెప్పనివి కూడా చేస్తాను’ అని శ్రీ జగన్‌ భరోసా ఇచ్చారు.

దిగజారిన వ్యవస్థ :
'రాజకీయం అంటే ప్రతీ పేదవాడి గుండె చప్పుడు వినడం అని దివంగత మహానేత వైయస్ఆర్‌ ఎప్పుడూ అనేవారు. చనిపోయిన తర్వాత కూడా ప్రతీ పేదవాడి గుండెల్లో బతికే ఉండటం కోసం ఆరాటపడడమే రాజకీయమని ఆయన అనే వారు. కానీ ఈ రోజు రాజకీయం ఒక చదరంగంలా తయారుచేశారు. ఓట్లు, సీట్ల కోసం ఏ గడ్డి అయినా తినడానికి వెనకాడడంలేదు. ఎన్ని అబద్ధాలు ఆడడానికైనా వెనకాడడంలేదు. ఒక మనిషిని ఎలా తప్పించాలి అని ఆలోచిస్తున్నారు. ఒక మనిషి లేకుండా ఒక పార్టీ లేకుండా ఎలా చేయాలని ఆలోచన చేస్తున్నారు. అన్యాయంగా కేసులు పెట్టి ఒక మనిషిని జైలు పాలు చేయడానికైనా వెనుకాడడంలేదు. బంగారు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి వెనుకాడలేదు. వ్యవస్థ దిగజారిపోయింది. వైయస్ పరిపాలనకు ముందు.. ఇప్పుడు జరుగుతున్న పాలనను ఒకసారి బేరీజు వేసుకోవాలి‌' అని శ్రీ జగన్‌ సూచించారు.

రైతు జీవీతాలతో బాబు ఆటలు :
'తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసినప్పుడు రుణాల మాఫీ దేవుడెరుగు.. కనీసం వడ్డీల మాఫీ అయినా చంద్రబాబు చేయలేదేం? అది సాధ్యం కాదు కాబట్టి చేయలేదు. రైతు రుణాలు మాఫీ అంటాడు.. డ్వాక్రా రుణాల మాఫీ అంటాడు. మొత్తం రూ. 1.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ అంటాడు. మన బడ్జెట్‌లో మనకొచ్చే ఆదాయాలు కేవలం రూ. 1.25 లక్షల కోట్లుంటే చంద్రబాబు 1.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తానంటున్నాడు. పట్టపగలే అబద్ధాలు చెప్పే ఇలాంటి దొంగ వాగ్దానం చేస్తే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తే.. ఆ తర్వాత రైతన్నలు బ్యాంకుల వద్దకు రుణాల కోసం వెళ్తారు. మీరు కట్టాల్సి రుణాలు ఇంకా ప్రభుత్వం కట్టలేదు కాబట్టి మీకు కొత్త రుణాలు ఇవ్వబోమని బ్యాంకులు చెబుతాయి. అప్పుడు ఆ రైతన్న పరిస్థితి ఎంత అన్యాయంగా ఉంటుందో ఆలోచించాలి' అన్నారు.

రాష్ట్రంలో ఎన్ని ఇళ్లున్నాయో బాబుకు తెలుసా? :
'చంద్రబాబు ఇంటింటికీ ఒక ఉద్యోగం ఇస్తానంటున్నాడు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి 65 ప్రభుత్వ సంస్థలను మూసివేయించి 26 వేల మందిని నడిరోడ్డు మీదకు నెట్టాడు. రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఉంటాయో చంద్రబాబుకు తెలుసా? రాష్ట్రంలో మూడున్నర కోట్ల ఇళ్లున్నాయి. అంటే మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్తున్నాడు. స్వాతంత్య్రం వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో ఆయనకు తెలుసా? రాష్ట్రంలో అన్ని ఉద్యోగాలు కలిపి 20 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అలాంటిది మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఇస్తానని పట్టపగలు అబద్ధాలు ఆడుతున్నాడు’ అని శ్రీ జగన్‌ దుయ్యబట్టారు.

వైయస్ కలలుగన్న సువర్ణయుగాన్ని తెచ్చుకుందాం‌ :

'చంద్రబాబు పాలనను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. అలాగే దివంగత మహానేత వైయస్ఆర్ సువర్ణయుగాన్ని గుర్తుకు తెచ్చుకోండి. కృష్ణా జిల్లాలో వ్యవసాయం అన్నది కీలకమైంది. చంద్రబాబు హయాంలో మన కళ్ల ఎదుటే ఆల్మట్టి నిర్మాణం మొదలుపెట్టింది. మన కళ్ల ఎదుటే కృష్ణా ప్రాంతానికి సంబంధించి ఒక పంట వేయడానికి కూడా రైతన్నలు ఇబ్బంది పడిన పరిస్థితి ఉంద‌'ని ఆవేదన వ్యక్తంచేశారు. దివంగత మహానేత వైయ‌స్ ‌తన హయాంలో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన వ్యక్తి. మాట కోసం ఎందాకైనా పోయే విశ్వసనీయత పాలన కావాలా లేదా ఆలోచన చేయండి. ప్రస్తుత ఎన్నికల్లో ఒకవైపున విశ్వసనీయత, నిజాయితీ ఉన్నాయి. మరో వైపు కుళ్లు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య పోటీ జరుగుతోంది. ఈ పరిస్థితిలో మీరంతా ఒకటి కావాలి. దివంగత నేత కలలుగన్న సువర్ణయుగాన్ని తెచ్చుకుందాం' అని పిలుపునిచ్చారు.

తాజా వీడియోలు

Back to Top