సోమిరెడ్డి.. బాగా నటిస్తున్నావ్

  • సరిదిద్దుకోలేని పొరపాటు చేశావ్ సోమిరెడ్డి
  • ఇప్పటికైనా చేసిన తప్పుకు ప్రజల క్షమాపణ కోరు
  • నీ అవినీతి దేశవ్యాప్తంగా తెలిసిపోయింది
  •  ప్రతీ ఆరోపణికి కట్టుబడి ఉన్నా
  • అది వాస్తవం కాదని నిరూపిస్తే ఏ శిక్షకైనా నేను సిద్ధం
  • సోమిరెడ్డి సీబీఐ విచారణకు నీవు సిద్ధమా
  • సాయంత్రానికి రాజీనామా చేసే దమ్ముందా
నెల్లూరుః టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికే తనపై నిందారోపణలు చేస్తున్నారని  వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతికి సంబంధించి ఆధారాలతో సహా బయటపెట్టానని, దమ్ముంటే ఆయన సీబీఐ విచారణకు సిద్ధపడాలని కాకాని సవాల్ విసిరారు. ఒకవేళ తాను బయటపెట్టిన డాక్యుమెంట్లు నకిలీవని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని  అన్నారు. ఒక్కొక్కటిగా బయటపడుతున్న సోమిరెడ్డి అక్రమాలను చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారని కాకాని తెలిపారు. సోమిరెడ్డి అవినీతి బాగోతం దేశవ్యాప్తంగా తెలిసిపోయిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో చంద్రమోహన్ రెడ్డి బ్రహ్మాండంగా నటిస్తున్నాడని కాకాని విమర్శించారు. పవర్ ప్రాజెక్ట్ లను మెయింటైన్ చేస్తూ  తన ఇంటికొచ్చిన వారినల్లా చందాలు అడుగుతూ సోమిరెడ్డి బాగా నటిస్తున్నాడన్నారు.  సోమిరెడ్డి తన అవినీతి వెలుగుచూడగానే తనకున్న ఇళ్లన్నంటిలో ఉన్న పేపర్లను ఖాళీ చేసి వచ్చాడని ఎద్దేవా చేశారు. సీబీఐ వాళ్లు వస్తే ఆధారాలు దొరక్కుండా చేసేందుకు ఈ నాలుగురోజులు తన ఇళ్లచుట్టూ తిరిగాడని తూర్పారబట్టారు . తాను చేసిన ప్రతీ ఆరోపణకి కట్టుబడి ఉన్నానని, నెల్లూరులోనే ఉంటానని కాకాని తెలిపారు. సోమిరెడ్డిలాగా ఎక్కడకు పారిపోనని చెప్పారు. . ఇప్పటికే సోమిరెడ్డి సరిదిద్దుకోలేని తప్పుచేశాడన్నారు. ఇప్పటికైనా నటించడం మాని హుందాగా మాట్లాడడం నేర్చుకోవాలని, అధికారులకు సహకరించి చేసిన తప్పుకు ప్రజల ముందు క్షమాపణ కోరాలని అన్నారు. ఏ నియోజకవర్గ ప్రజలను అడ్డుపెట్టుకొని  ఇంత డబ్బు సంపాదించాడో అందులో సగ శాతం ఆ నియోజకవర్గ ప్రజలకు ఖర్చుపెడితే సోమిరెడ్డి ప్రాయోశ్చిత్తం చేసుకున్నట్లు అవుతుందని సూచించారు. 

సోమిరెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించుకోకుండా కాకాని కబ్జాకోరు, ఫోర్జరీ పరుడు, ఆయన డాంక్యుమెంట్లు నకిలీవంటూ ఏవేవో మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తన దగ్గర  ఉన్న ఆధారాలతో కూడిన పత్రాలను మీడియా ముందు పెట్టానని,  ఇవి నిరాధారం అని చూపిస్తే రాజకీయాల నుంచి వైదలొగేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కాకాని తెలిపారు. జనాన్నిమోసం చేసేందుకు సోమిరెడ్డి ఇంకా బుకాయిస్తున్నాడని కాకాని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీవు, నీకుటుంబసభ్యుల పాస్ పోర్టు బయటపెట్టమంటే అవి బయటపెట్టకుండా ...కాకానికి 24 గంటలు సమయం ఇస్తున్నా, పోలీస్ కేసు పెడతా అని మాట్లాడుతున్నావ్. తనకు సమయమివ్వడానికి నీవెవరని సోమిరెడ్డిపై కాకాని నిప్పులు చెరిదారు. సోమిరెడ్డి బ్రహ్మాండంగా నటిస్తున్నాడని, ఇలాంటి నటనలు చాలా చూశానని కాకాని అన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు ఎక్కడైనా విచారణ జరిపిస్తాం గానీ సోమిరెడ్డి తనకు తానే ఫోర్జరీ, నకిలీవని సర్టిఫికెట్ ఇచ్చుకోవడం సిగ్గుచేటన్నారు.  జిల్లా ప్రజానీకం అంతా సోమిరెడ్డి బాగోతాన్ని గమనిస్తున్నారని తెలిపారు. రూ. వేలకోట్లు విదేశీ మారకద్రవ్యంలో బ్లాక్ మనీ రూపంలో హాంకాంగ్, మలేషియా, బ్యాంకాక్,  సింగపూర్ తరలించి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే లాభమేముందని అన్నారు.  కేసును  తొక్కిపెట్టేందుకు తన మద్దతుదారులను తీసుకొచ్చి ర్యాలీలు పెట్టి గబ్బుపట్టిస్తున్నాడన్నారు.  జనాన్ని మభ్యపెట్టేందుకు పీఎస్ లో ఫిర్యాదులు, సమయం అంటూ సోమిరెడ్డి చాలా తెలివిగా మాట్లాడుతున్నాడని పైర్ అయ్యారు. 

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి త్రిమూర్తి పవర్ ప్రై లిమిటెడ్ లో ఇప్పటికీ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడని కాకాని గోవర్థన్ రెడ్డి మరోసారి ఆధారాలను మీడియముఖంగా బయటపెట్టారు. ఆయన సతీమణి సోమిరెడ్డి జ్యోతి పేరుతో త్రిమూర్తి, సాగర్, సాయిస్ఫూర్తి పవర్ ప్రై లిమిటెడ్ ఉందని వివరించారు.  సాయిస్ఫూర్తి ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్టర్ గా ఆమె రిజైన్ చేసిందని, ఇంకా  రెండు కంపెనీలకు డైరెక్టర్ గా ఉందని తెలిపారు.  ఇది వాస్తవమా కాదో నిర్దారించుకోవాలన్నారు. సోమి రెడ్డి కుమారుడికి సంబంధించి 9 కంపెనీలున్నాయని అందులో నాలుగు కంపెనీల్లో చంద్రమోహన్ రెడ్డి డైరెక్టర్ గా కొనసాగుతున్నాడని తెలిపారు. ఇప్పుడున్న ఆధారాలను బట్టే 7, 8 కంపెనీల్లో నీకు భాగస్వామ్యం ఉందే దీనికేం సమాధానం చెబుతావని నిలదీశారు.  చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు అమ్ముకున్నానన్న నీవు ఇన్ని కంపెనీలున్నాయని ఎవరికైనా చెప్పిన సందర్భాలున్నాయా..? అని ధ్వజమెత్తారు. డొంకతిరుగుడు సమాధానాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నావ్ తప్ప ఎక్కడైనా సూటిగా ఓ ప్రశ్నకు సమాధానం చెప్పగలుగుతున్నావా అని విరుచుకుపడ్డారు. దేశ, విదేశాల్లో నీకుండే కంపెనీలు, పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఆధారాలు బయటపెట్టా. నా ఆరోపణలను చూపించగలిగావా. దొంగల ముఠా, పోర్జరీ ముఠా నాయకుడు అంటూ తన గురించి మాట్లాడే అర్హత సోమిరెడ్డికి లేదని కాకాని దుయ్యబట్టారు.  సోమిరెడ్డికి నీతి, నిజాయితీ ఉంటే తనపై వచ్చిన ఆరోపణలను నిర్దారణ చేసుకొని సాయంత్రానికి రాజీనామా చేసే దమ్ముందా అని కాకాని ప్రశ్నించారు.  

తాజా వీడియోలు

Back to Top