వైయస్‌కు తెలంగాణతో వీడని బంధం

నల్లగొండ:

మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారని, ఈ ప్రాంత ప్రజలతో ఆయన‌కు విడదీయలేని అనుబంధం ఉందని వైయస్‌ఆర్ ‌తనయ శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. వైయస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో వందలాది మంది చనిపోతే వారిలో అత్యధికులు తెలంగాణ వారే‌ అన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఆ మహానేతకు ఉన్న స్థానం అలాంటిదని ఆమె గర్తు చేసుకున్నారు. నల్లగొండ జిల్లాలో శుక్రవారం నేరేడుచర్ల, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేటలలో నిర్వహించిన ‘వైయస్ఆర్ జనభేరి’ సభల్లో‌ శ్రీమతి షర్మిల ప్రసంగించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరంటూ తెలంగాణ ప్రాంతంలో ‘హెడ్‌లైన్సు టుడే’ వార్తా సంస్థ సర్వే చేస్తే 60 శాతం మంది వైయస్‌కే ఓటేశారని గుర్తుచేశారు. రాజశేఖరరెడ్డి తెలంగాణలో ఇంకా సజీవంగా ఉన్నారని, తెలంగాణ ప్రజల అభిమానం లేకుండా ఆయన పెద్ద నాయకుడయ్యేవారా? అని ఆమె అన్నారు. ‘మేమే మీకు రుణపడి ఉన్నాం. మా కుటుంబమే మీకు రుణపడి ఉంది. ఆ రుణం తీర్చుకోవడానికే మీ ముందుకు వచ్చాం. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, ఇబ్బందులు ఎదురైనా ముందుకే వెళుతున్నాం. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా.. రాజన్న రాజ్యానికి నాంది పలికేందుకు మీరు ఓటేసే ముందు ఒక్కసారి వైయస్ఆర్‌ను గుర్తు చేసుకోండి. వైయస్ఆర్ కాంగ్రె‌స్ అభ్యర్థులను గెలిపించేందుకు ఫ్యా‌న్ గుర్తుకు ఓటేయండి’ అని‌ శ్రీమతి షర్మిల విజ్ఞప్తి చేశారు.

సువర్ణ పాలనతో భరోసా కల్పించిన వైయస్ఆర్ :

సువర్ణ పాలనలో ప్రతీ వర్గానికి మహానేత వైయస్ఆర్ భరోసా ‌కల్పించారని శ్రీమతి షర్మిల ఈ సందర్భంగా గుర్తుచేశారు. రైతులకు సాగునీరు, ఉచిత విద్యుత్, వడ్డీల మాఫీ, రుణాల మాఫీ, మహిళలకు పావలా వడ్డీ రుణాలు, విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్సుమెంట్, పేదలకు పక్కా ఇళ్లు, బీదలకు కార్పొరేట్ వైద్యం, 108, 104, అభయహస్తం, ఉపాధి హామీ వంటి అనేక పథకాలను అన్ని వర్గాలకు ప్రయోజనం కలిగేలా ఎంతో అద్భుతంగా అమలు చేశారని పేర్కొన్నారు.

‌‘తన పదవీ కాలంలో వైయస్ఆర్ ఏనాడూ ధరలు, పన్నులు పెంచలేదు. ఆయన హయాంలో ఆర్టీసీ చార్జీలు, నిత్యావసర సర‌కుల ధరలు పెరగలేదు. రైతులకు మద్దతు ధర లభించింది. ఇప్పుడు చూస్తే కరెంటు బిల్లులు షాక్ కొట్టిస్తున్నాయి. రూ. 32 వేల కోట్ల భారాన్ని ప్రజల నెత్తిన రుద్దారు’ అని కాంగ్రె‌స్ నేతలపై‌ శ్రీమతి షర్మిల మండిపడ్డారు. కాంగ్రెస్‌ను రెండుసార్లు అధికారంలోకి తెచ్చినప్పుడు వైయస్ఆర్‌ను ఇంద్రుడు, భగీరథుడు అన్నారు. మహానేత మరణం తర్వాత ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి దోషిగా ముద్ర వేయాలని చూశారు. రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఎందరికో టికెట్లిచ్చి, పదవులు కట్టబెడితే వెన్నుపోటు పొడిచారు’ అని ఆమె ధ్వజమెత్తారు.

బాబుకు అధికారం ఇస్తే.. గొయ్యి తవ్వుకున్నట్లే :
ప్రజా వ్యతిరేక విధానాలు, పాలనపై ప్రభుత్వ కాలర్ పట్టు‌కుని నిలదీయాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వాన్నే తన భుజాలపై మోశారని శ్రీమతి షర్మిల విమర్శించారు. విపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే విప్ జారీ చేసి మరీ ‌ఆయన రక్షణ కవచంగా నిలిచారని ఆరోపించారు. ‘తనకు అధికారమిస్తే రాష్ట్రాన్ని సింగపూర్, మలేసియా చేస్తానంటున్నారు. మరి తొమ్మిదేళ్ల పాలనలో ఏం చేశారు? ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయించి 26 వేల ఉద్యోగాలు ఊడగొట్టిన బాబు.. ఇప్పుడేమో మూడున్నర కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని, రైతుల రుణాలు మాఫీ చేస్తానని అంటున్నారు. ఆయనకు అధికారమిస్తే మన గొయ్యి మనం తవ్వుకున్నట్లే’ అని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నిర్వర్తించాల్సిన బాధ్యతను వైయస్ఆర్ కాంగ్రె‌స్ తీసుకుందని, ప్రజా సమస్యలపై వారి పక్షాన నిలబడి పోరాడిందని గుర్తు చేశారు.

ప్రజలను‌ కాంగ్రెస్‌ పార్టీ హింస పెట్టింది :
ప్రజల బాగోగులను కాంగ్రెస్‌ పార్టీ ఏనాడూ పట్టించుకోలేదని, ప్రజలను హింసించిందని శ్రీమతి షర్మిల ధ్వజమెత్తారు. ‘ఉచిత విద్యుత్ లేదు. మద్దతు ధర లేదు. ఫీజు రీయింబ‌ర్సుమెంటు ఎగ్గొట్టారు. ఆరోగ్యాన్ని భ్రష్టు పట్టించారు. చార్జీలు, పన్నుల భారం వేశారు. విత్తనాలు, ఎరువుల ధరలు పెంచారు. గ్యాస్ ధర రూ. 450కి చేరింది’ అని శ్రీమతి షర్మిల కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగారు.

రాజన్న రాజ్యం... వైయస్ఆర్‌సీపీకే సాధ్యం :
విశ్వసనీయత, విలువలకు వై‌యస్‌ జగన్ కట్టుబడ్డారని, ‘ఓదార్పు’ అన్న ఒక్క మాట కోసం పదవులు వదులుకున్నారని‌ శ్రీమతి షర్మిల అన్నారు. ‘చేయని నేరానికి జైలుకు వెళ్లాడు. ఫీజు రీయింబర్సుమెంటు కోసం వారం రోజులు దీక్ష చేశాడు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎండనక.. వాననకా, పగలనక.. రాత్రనకా ప్రజల్లోనే తిరిగాడు’ అని గుర్తు చేశారు. ‘వైయస్ఆర్ పథకాలను పక్కాగా అమలు చేయాలన్నా, ఆయనలా ప్రజలను తన సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకోవాలన్నా, రాజన్న రాజ్యం స్థాపించాలంటే.. అది ఒక్క వై‌యస్ఆర్‌సీపీకే సాధ్యం. వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ను ఆశీర్వదించండి. ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఓటు వేసే సమయంలో వై‌యస్‌ను గుర్తు చేసుకోండి. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీని గెలిపించండి’ అని ప్రజలకు‌ శ్రీమతి షర్మిల విజ్ఞప్తి చేశారు.

Back to Top