రుణం తీర్చుకోవడానికే మా పోరాటం

వరంగల్:

‘వైయస్ఆర్ మరణించినప్పుడు ఆ బాధను తట్టుకోలేక తెలంగాణలోనే ఎక్కువ మంది ఆయన వెంటే వెళ్లారు. ఇది తెలంగాణ బిడ్డలకు, వై‌యస్‌ఆర్‌కు ఉన్న చెరగని అనుబంధం. ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరని ‘హెడ్‌లైన్సు టుడే’ వార్తా సంస్థ ఇటీవల సర్వే నిర్వహిస్తే.. తెలంగాణలోని 60 శాతం మంది వైయస్‌ఆర్ పేరే చెప్పారు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఆ మహానేతకు సుస్థిర స్థాన‌ం ఉంది. తెలంగాణ ప్రజలు తమ గుండెల్లో వైయస్ఆర్‌కు చోటిచ్చారు. మీ అభిమానాన్ని మేము గుర్తుంచుకుంటాం. మేం మీకు రుణపడి ఉంటాం. వైయస్‌ఆర్ కుటుంబం మీకు రుణపడి ఉంది. ఆ రుణం తీర్చుకోవడానికి మీ ముందుకు వస్తున్నాం. ఎంత కష్టం.. నష్టం వచ్చినా.. మీ రుణం తీర్చుకోవడానికే పోరాడుతున్నాం’ అని‌ శ్రీమతి షర్మిల ఉద్వేగంతో మాట్లాడారు ‘వైయస్ఆర్ జనభేరి’లో భాగంగా ఆమె శనివారం వరంగ‌ల్ జిల్లా మరిపెడ, కురవి, మహబూబాబాద్, గూడూరు, నర్సంపేటలో రో‌డ్‌షో నిర్వహించారు. మరిపెడ, మహబూబాబాద్, నర్సంపేటలో ఆమె  ప్రసంగించారు.‌

ప్రజలను కన్నబిడ్డల్లా... రాష్ట్రాన్ని సొంత కుటుంబంలా చూసుకుని పరిపాలించే రాజన్న రాజ్యం మళ్లీ రావడానికి వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీని ఆదరించాలని‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజలను సొంత బిడ్డల్లా, రాష్ట్రాన్ని సొంత కుటుంబంలా చూసుకుని పరిపాలించారు. ఆయన ఎన్నడూ తెలంగాణ, సీమాంధ్రలను వేరుచేసి చూడలేదు. అన్ని ప్రాంతాలను, అన్ని వర్గాల ప్రజలను సొంత కుటుంబంలా భావించారు. వైయస్ హయాంలో రైతులకు రుణమాఫీ, విద్యు‌త్ కనెక్షన్లు, ఉచిత విద్యుత్, విద్యు‌త్ బకాయిల మాఫీ విషయంలో తెలంగాణకే పెద్ద పీట వేశారు. మహానేతకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పాదయాత్రను మొదలు పెట్టింది తెలంగాణలోనే. 108, 104, ఆరోగ్యశ్రీ, ఫీజు ‌రీయింబర్సుమెంట్ ఇలా ఎన్నో పథకాలను తెలంగాణలోనే మొదలు పె‌ట్టారు. తెలంగాణ పట్ల తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. పేద కుటుంబాలకు 13 లక్షల ఎకరాల భూములను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రజల గుండెల్లో వైయస్ చెరగని ముద్ర వేశారు’ అని‌ శ్రీమతి షర్మిల పేర్కొన్నారు.

గత ఐదేళ్లలో వైయస్ఆర్‌ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచిందని మండిపడ్డారు. వై‌యస్ఆర్ హయాంలో విద్యు‌త్ చార్జీలు, ఏ ఒక్క పన్నూ పెంచలేదని, ఆయన మరణం తర్వాత కాంగ్రె‌స్ ప్రభుత్వం అన్ని చార్జీలు, పన్నులు పెంచి పేదల నడ్డి విరిచిందని ధ్వజమెత్తారు.

విశ్వసనీయతకు కట్టుబడిన జగనన్న:
జగనన్న ప్రజల పక్షాన నిలిచారని, రాత్రనక, పగలనక ఆయన మాత్రమే పేద విద్యార్థుల ఫీజుల కోసం దీక్ష చేశారని, పోరాడారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. రైతులు, చేనేత కార్మికుల సంక్షేమానికి, ఫీజుల తగ్గింపు కోసం రోజుల తరబడి దీక్ష చేశారన్నారు. ‘ఓదార్పు’ అనే ఒక్క మాట కోసం పదవిని వదులుకుని విలువలు, విశ్వసనీయతకు కట్టుబడ్డారని చెప్పారు. చేయని నేరానికి జైలుకు వెళ్లారన్నారు. బోనులో ఉన్నా.. సింహం సింహమే అని నిరూపించుకున్నారని అన్నారు. మహానేత వైయస్‌లాగా ప్రజలను చూసుకునే జననేత జగన్‌ అని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు.

కానీ.. ప్రజల పక్షాన నిలబడాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధికార పార్టీని భుజాలపైన మోసిందని శ్రీమతి షర్మిల విమర్శించారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ‘మంచివాడని చంద్రబాబుకు ఎన్టీఆర్ తన కూతురునిచ్చి పెళ్లి చేశారు. కాంగ్రె‌స్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన చంద్రబాబును టీడీపీలోకి పిలిచి మంత్రి పదవిచ్చారు. అయితే ముఖ్యమంత్రి కుర్చీపై బాబు కన్ను పడింది. సొంత మామ అని కూడా చూడకుండా సీఎం పదవి కోసం వెన్నుపోటు పొడిచా‌రు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ నుంచి ఆయననే వెలివేశా‌రు. చివరకు ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించారు. మోసం.. వెన్నుపోటు నుంచి పుట్టిన చంద్రబాబు.. వ్యవసాయం దండగ అన్నారు. మద్యపాన నిషేధం, రెండు రూపాయలకే కిలో బియ్యం లాంటి ఏ ఒక్క వాగ్దానాన్నీ నిలబెట్టుకోలేదు. ఇప్పుడు ఎన్నో హామీలిస్తున్న చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయలేదన్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఏ రోజూ ప్రజా సమస్యలపై పోరాడలేదన్నారు. రైతులు, చేనేత, కార్మిక, విద్యార్థుల పక్షాన నిలవలేదని, పెంచిన చార్జీలను తగ్గించాలని అడగలేదని విమర్శించారు.

మహానేత రాజన్నను గుర్తు చేసుకోండి :
మహానేత రాజన్న ఆశయం కోసం పుట్టిన వైయస్ఆర్‌సీపీతోనే పేదల కోసం పెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు సాధ్యమవుతుందని శ్రీమతి షర్మిల అన్నారు. ‘మీ రుణం తీర్చుకునే అవకాశం మాకివ్వండి. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఓటు వేసే ముందు.. మీ గుండెల్లో ఉన్న రాజన్నను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను ఆశీర్వదించండి. మీకు సేవ చేసే భాగ్యం ఇవ్వండి. నా మీద ఆప్యాయతతో మండుటెండలో నా కోసం వచ్చిన మీకు శిరస్సు వంచి పేరుపేరునా.. చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా’ అని శ్రీమతి షర్మిల విజ్ఞప్తి చేశారు.

శ్రీమతి షర్మిల వెంట ఈ రోడ్‌షోలో వైయస్ఆర్‌సీపీ మహబూబాబాద్ లో‌క్‌సభ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు, డోర్నక‌ల్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి బానో‌త్ సుజాత‌ మంగీలాల్, ములుగు నియోజకవర్గ అభ్యర్థి లోకిని సంపత్, సీపీఎం మహబూబాబాద్ అసెంబ్లీ అభ్యర్థి బానో‌త్ సీతారాం‌ నాయక్, నర్సంపేట అభ్యర్థి గాదె ప్రభాకర్‌రెడ్డి, వైయస్ఆర్‌సీపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ముత్తినేని సోమేశ్వరరావు, మహబూబాబా‌ద్ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త జెన్నారెడ్డి మహేంద‌ర్‌రెడ్డి, నర్సంపేట నియోజకవర్గ సమన్వయకర్త నాడెం శాంతికుమార్‌ పాల్గొన్నారు.

Back to Top