చంద్రబాబు నిస్సిగ్గు వాగ్దానాలు

హైదరాబాద్:

‘రాష్ట్రాన్ని సింగపూర్, జపాన్‌లా మారుస్తానని.. అన్నీ ఉచితంగా ఇస్తానంటూ నిస్సిగ్గుగా వాగ్దానాలు చేస్తున్న చంద్రబాబు.. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశార’ని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. మల్కాజ్‌గిరి లోక్‌సభా స్థానం పరిధిలోని కుత్బుల్లాపూర్, షాపూర్‌నగర్, మల్కాజ్‌గిరి, కంటోన్మెంట్, శాంతినగర్, ఎల్‌బీనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలు, రోడ్‌షోలలో ఆమె పాల్గొన్నారు. సభలు, రోడ్‌షోలకు హాజరైన అశేష జనసందోహాన్ని ఉద్దేశించి శ్రీమతి షర్మిల ప్రసంగించారు.

మహానేత డాక్టర్‌ వైయస్ఆర్ తన ఐదేళ్ల పాలనాకాలంలో పేదలపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చూస్తే... తర్వాత కాంగ్రెస్ ‌ప్రభుత్వం జనంపై రూ. 32 వేల కోట్ల భారం మోపిందని శ్రీమతి షర్మిల మండిపడ్డారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వృద్ధులు ఇలా అని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిన ఘనత వైయస్ఆర్‌దే అని ఆమె గుర్తుచేశారు. జనం గుండెల్లో వైయస్ఆర్ ఉన్నారని చెప్పారు. పేదల కోసం ఆయన ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబ‌ర్సుమెంట్, రాజీవ్ గృహకల్ప వంటి ఎన్నో సంక్షేమ పథకా‌లు ప్రవేశపెట్టారని తెలిపారు.

చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో 16 లక్షల మందికి పింఛన్లు ఇస్తే.. వైయస్ఆర్ 71 లక్షల మందికి ‌ఇచ్చారని చెప్పారు. చంద్రబాబు నాయుడు తన పాలనాకాలంలో ఎనిమిదిసార్లు విద్యుత్ చార్జీలు పెంచారని, వై‌యస్ఆర్ ఒక్క రూపాయి కూడా పెంచలేదని‌ శ్రీమతి షర్మిల వివరించారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినపుడు ప్రతిపక్ష నేత అయి ఉండీ విప్ జారీ చేసి‌ మరీ కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. కేంద్రంలో, రాష్ట్రంలో రెండు మార్లు కాంగ్రె‌స్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించిన మహానేత వై‌యస్ రాజశేఖరరెడ్డి పేరునే ఎఫ్‌ఐఆ‌ర్‌లో చేర్చిన ఘనత కాంగ్రెస్‌దని ఆమె మండిపడ్డారు.

సీల్డు కవర్ సీఎం కిర‌ణ్‌కుమార్‌రెడ్డి తన పాలనలో మహానేత ప్రవేశపెట్టిన జనరంజక పథకాలకు కొర్రీల మీద కొర్రీలు వేశారని, అన్ని చార్జీలు పెంచడమే అజెండాగా  పెట్టుకొని పాలన చేశారని శ్రీమతి షర్మిల విమర్శించారు. టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీలు ప్రజా సమస్యలపై ఏ ఒక్క పోరాటం చేయలేదని, వారికి ఓట్లడిగే నైతిక హక్కు లేదని శ్రీమతి షర్మిల స్పష్టం చేశారు. పదేళ్లుగా ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఏ రోజూ ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక పోరాటం చేయలేదని విమర్శించారు.

ఫీజు రీయింబర్సుమెంట్‌పై సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిదే అని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగిపోవద్దని, ఓటు వేసే ముందు మహానేత వైయస్ఆర్‌ను గుర్తుకు తెచ్చుకోవాలని ఓటర్లకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వై‌యస్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

మల్కాజ్‌గిరి లోక్‌సభా నియోజకవర్గం పార్టీ అభ్యర్థి దినేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. మల్కాజ్‌గిరిని నంబర్‌వన్ పార్లమెంటరీ స్థానంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఎల్‌బీ నగర్ అభ్యర్థి పుత్తా ప్రతా‌ప్‌రెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే అభ్యర్థి జి.సూర్యనారాయణరెడ్డి, కుత్బుల్లాపూర్ అభ్యర్థి కొల‌న్ శ్రీనివా‌స్‌రెడ్డి తదితరులు సభల్లో మాట్లాడారు.

Back to Top