నాపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి

అధికార పార్టీకి తొత్తులుగా కొందరు ఉద్యోగులు
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినా సమర్థించాలా..?
మా పార్టీ నేతలను ఇబ్బంది పెట్టినా ప్రశ్నించకూడదా..?
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

హైదరాబాద్‌: అనైతిక చర్యలకు పాల్పడుతున్న అధికారులకు తిప్పలు తప్పవని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ధ్వజమెత్తారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవుపలికారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరి నియోజకవర్గ అధికారులను ఇబ్బందులు పెడుతున్నారని ఏ ఒక్క ఉద్యోగితోనైనా చెప్పించండి అని సవాలు విసిరారు. కొందరు ఉద్యోగులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మా పార్టీకి ఓటేసిన ప్రజలను అధికారులు ఇబ్బందులకు గురిచేస్తుంటే ప్రశ్నించకూడదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నా.. ఉద్యోగులను సమర్థించాలా అని నిలదీశారు.  స్వప్రయోజనాల కోసం అధికారులను వాడుకుంటున్నానని చెప్పమనండి అని ఆరోపణలు చేసిన వారిపై విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో పనిచేసే అధికారులు నిత్యం స్వేచ్ఛగా, నిజాయితీగా, సేవా ధృక్పదంతో పనిచేయాలని చెబుతుంటానని స్పష్టం చేశారు. మీకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా కల్పించే వ్యక్తిత్వం తనదన్నారు. నియోజకవర్గంలో పనిచేసే కానిస్టేబుల్‌ నుంచి ఎస్‌ఐ వరకు తలారీ నుంచి తహసీల్దార్‌ వరకు, గ్రామ పంచాయతీ నుంచి ఎంపీడీఓ వరకు దాదాపు 2500 మంది ప్రభుత్వ ఉద్యోగులను తోబుట్టువులుగా భావించి ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజున దుస్తుల పంపిణీ చేస్తానని తెలిపారు. 

అప్పుడేమయ్యాయి ఉద్యోగ సంఘాలు
తహసీల్దార్‌ వనజాక్షిపై అధికార పార్టీ ఎమ్మెల్యే దాడి చేసినప్పుడు ఈ ఉద్యోగ సంఘాలన్నీ ఏమయ్యాయని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. విజయవాడలో అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే సీనియర్‌ అధికారిపై దాడి చేసినప్పుడు ఉద్యోగ సంఘాలన్నీ ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో 90 శాతం మంది ఉద్యోగులు నిస్పక్షపాతంగా పనిచేస్తున్నారని, వారికి వైయస్‌ఆర్‌ సీపీ అండగా ఉంటుందన్నారు. కానీ కొందరు టీడీపీ కార్యకర్తల్లా మారారని విమర్శించారు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్న అధికారులను మాత్రం వదిలిపెట్టమని హెచ్చరించారు. 
Back to Top