షర్మిల పాదయాత్రకు బెజవాడలో భారీ ఏర్పాట్లు

విజయవాడ, 26 మార్చి 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర కాసేపట్లో విజయవాడలో ప్రవేశించనున్నది. ఈ నేపథ్యంలో ఆమెకు అఖండ స్వాగతం తెలిపేందుకు జిల్లా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ విజయవాడలో భారీ‌ ఎత్తున ఏర్పాట్లు చేసింది. శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగే దారులన్నీ పార్టీ జెండాలు, బ్యానర్లతో నిండిపోయాయి. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 1.8 కిలోమీటర్ల పొడవైన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను జిల్లా విభాగం ఏర్పాటు చేసింది. ఈ రోజు సాయంత్రం ఐడు గంటలకు ప్రకాశం బ్యారేజీ మీదుగా శ్రీమతి షర్మిల యాత్ర విజయవాడలో ప్రవేశించనున్నది.

కాగా, శ్రీమతి షర్మిలకు అఖండ స్వాగతం పలికేందుకు అభిమాన జనసందోహం వేల సంఖ్యలో ప్రకాశం బ్యారేజ్‌ వద్దకు తరలివచ్చారు. 'జై జగన్'‌ నినాదాలతో ప్రకాశం బ్యారేజ్‌ దద్దరిల్లుతోంది. వందలాది బైక్‌లపై ర్యాలీతో శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు బ్యారేజ్‌ వద్ద ఉన్నారు.

విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ సెంట‌ర్‌లో నిర్వహించే భారీ బహిరంగసభలో శ్రీమతి షర్మిల మాట్లాడతారు. అనంతరం ఇస్లాంపేట, రాయల్ హోట‌ల్ సెంట‌ర్, చేపల మార్కె‌ట్, నెహ్రూ బొమ్మ సెంట‌ర్, చిట్టినగ‌ర్ మీదుగా పాత రాజేశ్వరిపేట‌కు శ్రీమతి షర్మిల చేరుకుంటారు. మంగళవారం రాత్రికి పాత రాజేశ్వరిపేటలోనే శ్రీమతి షర్మిల బస చేస్తారు.
Back to Top