షర్మిలకు ఓరుగల్లు నేతల సంఘీభావం

గురజాల (గుంటూరు జిల్లా), 27 ఫిబ్రవరి 2013: గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో బుధవారంనాడు వరంగల్ జిల్లా వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ‌నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు, దానిని భుజానికెత్తుకుని మోస్తున్న చంద్రబాబు నాయుడి తీరుకు వ్యతిరేకంగా శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను వరంగల్‌ జిల్లాలో కూడా చేస్తే తామంతా సంతోషిస్తామన్నారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో వరంగల్ జిల్లా ప్రజలు వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీకి ‌పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని పార్టీ నాయకులు పేర్కొన్నారు.

వైయస్‌ఆర్‌సిపి వరంగల్‌ జిల్లా కన్వీనర్‌, అనుబంధ సంఘాల కన్వీనర్లు, వరంగల్ పట్టణ కన్వీనర్‌, పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ సహా సుమారు 100 మంది వరకూ శ్రీమతి షర్మిలకు మద్దతు తెలిపేందుకు వచ్చారు. మీ వెంట మేం ఉంటామంటూ శ్రీమతి షర్మిలకు మద్దతు తెలిపేందుకే తామంతా వచ్చినట్లు చెప్పారు. రాజశేఖరరెడ్డి తీసుకువచ్చిన పథకాలు రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాయని వరంగల్‌ నాయకులు పేర్కొన్నారు. రాజశేఖరరెడ్డి పాలనను మరోసారి చూడాలని వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాజన్న రాజ్యం మళ్ళీ సాధ్యమవుతుందన్న భావన ప్రతి కుటుంబంలోనూ ఉన్నదన్నారు. జననేతను కుట్ర, కుతంత్రాలు చేసి జైలులో పెట్టిన విధానాన్ని వరంగల్‌ జిల్లా ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. కుట్రపూరితంగా వైయస్‌ కుటుంబాన్ని ఇబ్బందులపాలు చేస్తున్న కాంగ్రెస్‌, టిడిపిలకు గుణపాఠం చెప్పేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారన్నారు.
Back to Top