పచ్చచొక్కా తొడిగిన సెక్రటరీ

  • బాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్న అసెంబ్లీ సెక్రటరీ
  • డిగ్రీ కూడ లేకుండా సెక్రటరీగా కొనసాగుతున్న సత్యనారాయణ?
  • ఆయన విద్యార్హతలకు సంబంధించి సమాచారం ఇవ్వని సర్కార్
  • పట్టించుకోని గవర్నర్, స్పీకర్, చీఫ్ సెక్రటరీలు
  • అర్హత లేని వ్యక్తిని ఎలా కొనసాగిస్తారు..?
  • ప్రభుత్వ తీరుపై వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే ధ్వజం
హైదరాబాద్ః అసెంబ్లీ సెక్రటరీ సత్యనారాయణ  రూల్స్ ప్రకారం నడుచుకోకుండా పచ్చచొక్కాలు వేసుకొని తెలుగుదేశం కార్యకర్తలా పనిచేస్తున్నాడని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. అసెంబ్లీ సెక్రటరీ విద్యార్హతలకు సంబంధించి సమాచారం ఇవ్వాలని కోరి రెండేళ్లవుతున్నా ఇంతవరకు ప్రభుత్వం గానీ, అధికారులు గానీ దానిపై స్పందించకపోవడం చూస్తుంటే ఎంత దౌర్భాగ్యంగా పనిచేస్తున్నారో అర్థమవుతోందన్నారు. సమాచార హక్కు చట్టం కింద 45రోజుల లోపల కోరిన సమాచారం అందించాలని స్పష్టంగా చెబుతున్నా కూడ రెండేళ్ల కాలంగా ఇవ్వలేదంటే వీళ్లను ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. హైకోర్టులో తాను వేసిన కేసుల ద్వారా బలవంతంగా పంపించే పరిస్థితిని తెచ్చుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

ఇదే విషయంలో సమాచార హక్కు చట్టం కమీషనర్ కూడ ఎన్నోసార్లు అసెంబ్లీ పీఐవో, సెక్రటరీకి షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయాన్ని ఆర్కే గుర్తు చేశారు. సమాచార హక్కు కమీషన్ ను తప్పుదారి పట్టిస్తూ, సరైన సమాచారం ఇవ్వని కారణంగా అసెంబ్లీ పీఐవోకి మూడు నెలలపాటు రూ. 15వేలు జరిమానా కూడా విధించారని ఆర్కే తెలిపారు.  డీమ్డ్ పీఐవో అయిన అసెంబ్లీ సెక్రటరీకి  షోకాజ్ నోటీసులు ఇచ్చినా కూడ ఆయన హాజరు కాలేదన్నారు.  స్పీకర్, ఛీప్ సెక్రటరీ, గవర్నర్ ను స్వయంగా కలిసి వాళ్ల ఆఫీసులకు వెళ్లి సమాచారం కోరినా ఇవ్వలేదని ఆర్కే పేర్కొన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ మీటింగ్ లలో మా పార్టీ వాళ్లకి పనిచేయాలంటూ ఆదేశాలిచ్చిన బాబు, అధికారులకు కూడ సహకరించాలని ఆర్డర్ ఇచ్చాడేమోనని ఆర్కే అనుమానం వ్యక్తం చేశారు. శాసనసభలో వైయస్సార్సీపీ సభ్యులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆర్కే అన్నారు. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని సభ సెక్రటరీ ద్వారా నోటీసులిచ్చి స్పీకర్ ను కోరినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. 

అసెంబ్లీ సెక్రటరీ మీద బంజారాహిల్స్ లో క్రిమినల్ కేసు నమోదై నాంపల్లి కోర్టులో కేసు నడుస్తోందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగి మీద కేసు నడుస్తున్న సమయంలో తక్షణం ఆయన్ను తప్పించి విచారణ నుంచి క్లియరై బయటకొచ్చాకే తీసుకోవాలని సీసీఏ రూల్స్ చెబుతున్నాయని ఆర్కే తెలిపారు. అసెంబ్లీ సెక్రటరీ ఇంటర్ మాత్రమే చదివాడని, కనీసం డిగ్రీ కూడ లేదని ఆర్కే అన్నారు. సెక్రటరీగా చేయాలంటే కచ్చితంగా లా డిగ్రీ ఉండాలని  రూల్స్ చెబుతున్నా... చంద్రబాబు, గవర్నర్, స్పీకర్, చీఫ్ సెక్రటరీలు చర్యలు తీసుకోకుండా ఆయన్ను ఎందుకు పరిరక్షిస్తున్నారని ప్రశ్నించారు. ఆయన వల్ల మీకు కలిగే లబ్ది ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు శాసనసభను కూడ అధికారులను అడ్డుపెట్టుకొని ఎంత దారుణంగా, అన్యాయంగా పాలన సాగిస్తున్నాడో ప్రజలు గమనించాలని ఆర్కే సూచించారు.  

అసెంబ్లీ సెక్రటరీపై అభియోగాలున్నా కూడ ఆయనపై చర్యలు తీసుకోకుండా.....అలాంటి ఉద్యోగి అయితేనే తమకు పనికొస్తాడని బాబు, స్పీకర్ లు తమ తొత్తుగా పెట్టుకోవడం బాధాకరమన్నారు. తొలి శాసనసభలో గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో బాబు గవర్నర్ ను అడ్డుపెట్టుకొని చేయని పనులను చేసినట్టు చెప్పుకున్నా తాము అడ్డుపడలేదని, ప్రసంగం తర్వాత ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపామని ఆర్కే చెప్పారు.  లోకేష్ నామినేషన్ సమయం దగ్గర పడుతుందని చెప్పి బాబు మెప్పు పొందడం కోసం ఏకంగా సెక్రటరీ... గవర్నర్ ప్రసంగం జరుగుతుంటే మధ్యలో లేచి బయటకు వెళ్లిపోవడం బాధాకరమన్నారు.  సమాచార హక్కు కమీషన్ పీఐవోకి  ఏవిధంగా దండన వేసిందో అదే పరిస్థితి సెక్రటరీకి కూడ వస్తుందని హెచ్చరించారు. అర్హత లేని వ్యక్తిని కొనసాగించవద్దని గవర్నర్ ను కోరారు. ఇలాంటి తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత గవర్నర్ దేనని అన్నారు. 
Back to Top